శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 21 జనవరి 2017 (03:39 IST)

రిజర్వేషన్ల కొనసాగింపు అవసరమా: ఆరెస్సెస్ బాంబుతో బీజేపీ గుండెల్లో రాయి

రిజర్వేషన్ల కొనసాగింపుపై సమీక్ష జరగాల్సిందేనంటూ ఆర్ఎస్ఎస్ పబ్లిసిటీ చీఫ్ చేసిన అలవోక వ్యాఖ్య అయిదు రాష్టాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొంప ముంచనున్నాయా? అకాల వర్షాల్లాగా అకాల వ్యాఖ్యలతో లేని వివాదాలను మాతృసంస్థ రేపుతున్న సందర్భంగా ఎన్నికల

రిజర్వేషన్ల కొనసాగింపుపై సమీక్ష జరగాల్సిందేనంటూ ఆర్ఎస్ఎస్ పబ్లిసిటీ చీఫ్ చేసిన అలవోక వ్యాఖ్య అయిదు రాష్టాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొంప ముంచనున్నాయా? అకాల వర్షాల్లాగా అకాల వ్యాఖ్యలతో లేని వివాదాలను మాతృసంస్థ రేపుతున్న సందర్భంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ పూర్తిగా ఇరకాటంలో పడిపోయింది.
 
ఇటీవలి కాలంలో పాలక బీజేపీకి బయటి శత్రువుల కంటే ఇంటి పోరుతోనే ఎక్కువ నష్టం జరుగుతున్నట్లు ఎన్నో సంకేతాలు కనిపించాయి. దీని కొనసాగింపుగా ఆర్ఎస్ఎస్ ప్రచారాధిపతి శుక్రవారం రిజర్వేషన్ల కొనసాగింపుపై చేసిన వ్యాఖ్య ఎన్నికల ముంగిట ఉన్న బీజేపీ మెడకు చుట్టుకుంది. అయిదు రాష్ట్రాలో వచ్చే నెలలో జరగనున్న కీలకమైన ఎన్నికల్లో తలమునకలై ఉన్న బీజేపీపై మాతృసంస్థే సెల్ఫ్ గోల్ వేయడం గమనార్హం.
 
ఇంతకూ ఆర్ఎస్ఎస్ ప్రచారాధిపతి మన్మోహన్ వైద్య ఏమన్నారు? రిజర్వేషన్ పాలసీపై సమీక్ష జరపాల్సిందని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కరే రిజర్వేషన్లను శాశ్వతంగా కొనసాగించడంపై సానుకూలత ప్రకటించలేదని వైద్య పేర్కొన్నారు. 
 
ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లను ఒక ప్రత్యేక పరిస్థితుల్లోనే ప్రవేశపెట్టారు. ఎస్సీఎస్టీలకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని సవరించడానికే  రాజ్యాంగంలో రిజర్వేషన్లను పొందుపర్చారు. వారికి రిజర్వేషన్లు కల్పించడం మన బాధ్యత కూడా. అందుకే రాజ్యాంగం ప్రారంభమైన కాలం నుంచి రిజర్వేషన్లను అమలులోకి తెచ్చాం. కానీ రిజర్వేషన్లను శాశ్వతంగా కొనసాగించడం అంత మంచిది కాదని అంబేద్కరే పేర్కొన్నారు. అందుకే వాటికి ఒక కాలపరమితి అంటూ ఉండాలి అంటూ వైద్య వ్యాఖ్యానించారు. జైపూర్ లిటరేచర్ ఫెస్టవల్ సదస్సులో వైద్య ఇలా వ్యాఖ్యానించడంతో దుమారం చెలరేగింది. 
 
 రిజర్వేషన్ల కొనసాగింపుకు బదులుగా విద్య, తదితర రంగాల్లో ప్రజలందరికీ సమానావకాశాలు కల్పించేందుకు ప్రయత్నాలు జరగాలి. అలా కాకుండా శాశ్వతంగా రిజర్వేషన్లను కొనసాగిస్తే అది వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తుందని వైద్య వ్యాఖ్యానించారు.  
 
రిజర్వేషన్లపై ఇదేవిధమైన వ్యాఖ్యలను బీహార్ ఎన్నికలకు ముందుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేయడంతో ఆ ఎన్నికల్లో బీజేపీ మట్టిగొట్టుకుపోవడం తెలిసిందే. 
 
సామాజిక అణచివేత, వివక్ష కొనసాగినంత కాలం రిజర్వేషన్లు కొనసాగాల్సిందే, వీలైనంత త్వరగా మనం వివక్షను రూపుమాపాల్సిందే. కాని స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు ఎందుకు దక్కడం లేదో విచారించాల్సిన అవసరం మాత్రం ఉంది అంటూ వైద్య ఉపశమన వ్యాఖ్యలు చేశారు. 
 
కానీ ఎన్నికల బరిలో ముందుపీఠిన ఉన్న బీజేపీకి వైద్య వ్యాఖ్యలతో జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందని పరిశీలకులు అంటున్నారు.