గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 23 జూన్ 2018 (13:22 IST)

అమిత్ షా డైరెక్టరుగా ఉన్న బ్యాంకులో రూ.కోట్లు డిపాజిట్...

దేశంలో పెద్ద నోట్లను రద్దు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం ముందుగానే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు.. పలువురు బీజేపీ నేతలకు తెలిసినట్టుగా ఉంది. ఫలితంగా బీజేపీ నేతలు డైరెక్టర్లుగ

దేశంలో పెద్ద నోట్లను రద్దు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం ముందుగానే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు.. పలువురు బీజేపీ నేతలకు తెలిసినట్టుగా ఉంది. ఫలితంగా బీజేపీ నేతలు డైరెక్టర్లుగా ఉన్న జిల్లా సహకార బ్యాంకుల్లో రూ.కోట్లకు కోట్లు డిపాజిట్‌ అయ్యాయి. ముఖ్యంగా, బీజేపీ చీఫ్ అమిత్ షా అధ్యక్షుడిగా ఉన్న బ్యాంకులో అయితే, కొన్ని గంటల్లోనే వందల కోట్ల రూపాయలు డిపాజిట్ అయినట్టు తాజాగా తెలిసింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఓ కార్యకర్త సేకరించిన వివరాల్లో ఈ విషయం తేటతెల్లమైంది.
 
గుజరాత్ రాష్ట్రంలోని ఓ జిల్లా సహకార బ్యాంకుకు అమిత్‌ షా డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ బ్యాంకు రద్దయిన పాత నోట్లు భారీగా డిపాజిట్ అయ్యాయి. నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆ బ్యాంకు లాభదాయకంగా మలుచుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌‌లోని రెండు పెద్ద జిల్లా సహకార బ్యాంకులు అత్యధిక మొత్తంలో రద్దయిన నోట్లను తీసుకున్న విషయం బయటపడింది.
 
ఒకటి అహ్మదాబాద్‌ డీసీసీబీ కాగా… రెండోది రాజ్‌కోట్‌ డీసీసీబీ. వీటిలో అహ్మదాబాద్‌ డీసీసీబీ డైరెక్టర్లలో అమిత్‌ షా కూడా ఉన్నారు. ముంబైకి చెందిన మనోరంజన్‌ రాయ్‌ అనే సమాచార హక్కు ఓ పిటిషన్‌ ద్వారా ఈ వివరాల్ని తెలుసుకున్నారు. రూ 500, రూ 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ 2016 నవంబరు 8న ఆకస్మిక ప్రకటన చేశారు. ప్రజలు తమ దగ్గరున్న ఆ నోట్లను డిసెంబరు 30లోగా బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాలని సూచించారు. దీంతో పెద్ద ఎత్తున రద్దయిన నోట్లు బ్యాంకులకు చేరడం మొదలెట్టాయి. 
 
ఆ క్రమంలో అహ్మదాబాద్‌ డీసీసీబీకి కేవలం ఐదు రోజుల్లో అంటే నవంబరు 13 సాయంత్రానికి రూ 745.59 కోట్ల విలువైన రద్దయిన నోట్లు జమ అయ్యాయి. అటు రాజ్‌కోట్‌ డీసీసీబీలో రూ 693.19 కోట్ల విలువైన నోట్ల డిపాజిట్‌ జరిగింది. రాజ్‌కోట్‌ నుంచే మోడీ 2001లో మొట్టమొదట గుజరాత్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అక్కడి డీసీసీబీకి ఛైర్మన్‌ అయిన జయేశ్‌భాయ్‌ విఠల్‌భాయ్‌ రదాదియా ప్రస్తుతం విజయ్‌ రూపానీ ప్రభుత్వంలో కేబినెట్‌ మంత్రిగా ఉన్నారు. అహ్మదాబాద్‌ డీసీసీబీకి అమిత్‌ షా 2000లో ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆ బ్యాంకు డైరెక్టర్లలో ఒకరుగా కొనసాగుతున్నారు. కాగా, గుజరాత్ రాష్ట్రంలోని 11 డీసీసీబీలో ఏకంగా రూ.3118 కోట్ల రూపాయలు డిపాజిట్ కావడం గమనార్హం.