శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 22 అక్టోబరు 2016 (09:16 IST)

ములాయం ఇంటి రామాయణం : అఖిలేష్ యాదవ్ కొత్త పార్టీ

ఎస్పీ అధినేత ములాయం సింగ్ ఇంటి రామాయణం రచ్చకెక్కింది. ఆయన తనయుడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఫలితంగా యూపీ రాష్ట్ర రాజకీయాలు ర

ఎస్పీ అధినేత ములాయం సింగ్ ఇంటి రామాయణం రచ్చకెక్కింది. ఆయన తనయుడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఫలితంగా యూపీ రాష్ట్ర రాజకీయాలు రోజుకో విధంగా మలుపుతిరుగుతున్నాయి. 
 
వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మెజారిటీ వస్తే ఎమ్మెల్యేలే సీఎంను ఎన్నుకుంటారని ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఇటీవల ప్రకటించటం, బాబాయ్ శివ్‌పాల్‌తో విభేదాలు ముదురుతున్న నేపథ్యంలో సీఎం అఖిలేశ్ కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
ఎస్పీలో చీలిక తప్పదని.. త్వరలోనే ‘జాతీయ సమాజ్‌వాదీ పార్టీ’ లేదా ‘ప్రగతిశీల్ సమాజ్‌వాద్ పార్టీ’ పేరుతో కొత్త కుంపటి పెట్టేందుకు అఖిలేశ్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగానే అంతా పూర్తి చేసి మోటార్ సైకిల్ గుర్తుతో ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహాలు రచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
 
మరోవైపు... మొన్నటివరకు ఉమ్మడి కుటుంబంగా ఉన్న యాదవ్ ఫ్యామిలీ నుంచి విడిపోయిన అఖిలేశ్.. ఇటీవలే సీఎం అధికారిక నివాసానికి మకాం మార్చారు. నవంబర్ 5న పార్టీ రజతోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండగానే.. 3నుంచి ‘వికాస్ రథయాత్ర’ చేపట్టాలని నిర్ణయించారు. ఇవన్నీ పార్టీలో చీలిక తప్పదనే సంకేతాలను బలపరుస్తున్నాయి.