గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2017 (13:32 IST)

శశికళకు ముచ్చెమటలు.. జారుకుంటున్న ఎమ్మెల్యేలు... మా వాళ్లను పన్నీర్ కొనేస్తున్నారంటూ గగ్గోలు

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు ముచ్చెమటలు పడుతున్నాయి. బుధవారం రాత్రి వరకు తన గుప్పెట్లో ఉన్నట్టు కనిపించిన పలువురు ఎమ్మెల్యేలు ఇపుడు తుస్‌మంటూ జారుకుంటున్నారు. వీరంతా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు ముచ్చెమటలు పడుతున్నాయి. బుధవారం రాత్రి వరకు తన గుప్పెట్లో ఉన్నట్టు కనిపించిన పలువురు ఎమ్మెల్యేలు ఇపుడు తుస్‌మంటూ జారుకుంటున్నారు. వీరంతా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వంకు జై కొడుతున్నారు. దీంతో అప్రమత్తమైన శశికళ.. పన్నీర్ సెల్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తన వర్గంలోని ఎమ్మెల్యేలను ఆయన కొనుగోలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. 
 
గురువారం ఉదయం పోయెస్ గార్డెన్ ముందు చేరి పన్నీర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన అన్నాడీఎంకే కార్యకర్తలకు శశికళ అభివాదం చేశారు. ఆపై ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ, తన వర్గంలోని ఎమ్మెల్యేల సంఖ్య తగ్గినట్టు వచ్చిన వార్తలపై స్పందించారు. పన్నీర్‌కు కేవలం 8 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని అన్నారు. ఆయన ఎమ్మెల్యేలను డబ్బుతో కొనుగోలు చేస్తూ, నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడంటూ మండిపడ్డారు. 
 
దీంతో తన వర్గంలోని ఎమ్మెల్యేలు పన్నీర్ శిబిరంలోకి వెళ్లిపోతున్నారని అంగీకరించకుండానే శశికళ అంగీకరించినట్లయింది. మరోవైపు తన వెంట 45 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అవకాశం ఇస్తే, బలాన్ని నిరూపించుకుంటానని పన్నీర్ సెల్వం ధీమా చెప్పడం గమనార్హం.