బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 జులై 2017 (10:40 IST)

లగ్జరీ అపార్టు‌మెంట్‌లో శశికళ... చేతిలో యాపిల్ ఐ ఫోన్...

ఆదాయానికి మంచి ఆస్తుల సేకరణ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలు బయట ఉన్న ఓ అపార్టుమెంట్‌లో సేదతీరుతున్నారట. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర జైళ్ళ

ఆదాయానికి మంచి ఆస్తుల సేకరణ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలు బయట ఉన్న ఓ అపార్టుమెంట్‌లో సేదతీరుతున్నారట. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర జైళ్ళ శాఖలో డీఐజీగా పని చేసిన రూప వెల్లడించారు. 
 
జైలులో శశికళ తీరును బహిర్గతం చేసినందుకు ఆమెను ఇటీవల జైళ్ల శాఖ నుంచి ట్రాఫిక్‌కు బదిలీ చేసిన విషయం తెల్సిందే. ఇపుడు ఈమె సంచలన విషయాన్ని బయటపెట్టారు. బెంగళూరు పరప్పణ అగ్రహార జైల్లో శశికళ ఉండటం లేదని, జైలుకు సమీపంలో ఉన్న ఓ లగ్జరీ అపార్టుమెంటులో ఆమె నివసిస్తున్నట్టు తనకు సమాచారం ఉందని పేర్కొన్నారు. 
 
అపార్టుమెంట్ విషయం తనకు తెలిసి, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించానని, కానీ వీలుపడలేదని అన్నారు. ఆమె స్వయంగా పట్టుబడివుంటే తాను తీసుకునే చర్యలు భయంకరంగా ఉండేవన్నారు. తన అరోపణలు రుజువైతే, శశికళకు ప్రస్తుతం విధించిన నాలుగేళ్ల శిక్షకు అదనంగా మరికొన్ని సంవత్సరాల శిక్ష తప్పదన్నారు. 
 
జైల్లో ఆమె ఒక్క పని కూడా చేయలేదని, యాపిల్ ఐ ఫోన్ వాడారని, ఒక్క రోజు కూడా జైలు ఆహారం తినలేదని ఆమె వెల్లడించారు. ఖైదీల యూనిఫాంను పక్కన బెట్టిన ఆమె, ఖరీదైన చీరలు, చుడీదార్లనే వాడినట్టు ఆరోపించారు. కాగా, గత వారం నుంచి శశికళకు కల్పించిన అదనపు సౌకర్యాలన్నీ తొలగిపోయినట్టు అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే.