శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (08:39 IST)

ఆ బంగ్లాకు రాజభోగం.. అందుకోసమే శశికళ ఆ భవనంలో ఉంటున్నారా?

తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ నటరాజన్ ఒకటి రెండు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదీ కూడా ముఖ్యమంత్రి దివంగత జయలలిత నివశించిన ఇంటి నుంచే ఆమె తన మార్కు రాజకీయాలను చూపించనున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ నటరాజన్ ఒకటి రెండు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదీ కూడా ముఖ్యమంత్రి దివంగత జయలలిత నివశించిన ఇంటి నుంచే ఆమె తన మార్కు రాజకీయాలను చూపించనున్నారు. పోయెస్ గార్డెన్‌లో ఉన్న వీవీఐపీ ప్రముఖుల నివాసాల్లో ఒకటి వేద నిలయం. ముఖ్యమంత్రి దివంగత జయలలిత ముచ్చటపడి కట్టించుకున్న నివాసం. జయ జీవించి వుండగా ‘వేద నిలయం’లోకి మహామహులకు మాత్రమే ప్రవేశముండేది. ఏదేని ప్రత్యేక కార్యక్రమముంటే మినహా.. సాధారణ మంత్రులకు కూడా ఈ భవనంలోకి ప్రవేశం లభించేది కాదు. 
 
ఈ భవనాన్ని జయ 1967లో కేవలం రూ.లక్షా 32 వేలకు కొనుగోలు చేశారు. సినిమాల్లో వచ్చిన చిన్న మొత్తంతో జయ కొనుగోలు చేసిన ఆ భవనానికి తన తల్లి అసలు పేరు (వేదవల్లి)తో 'వేద నిలయం' అని నామకరణం చేశారు. జయ అధికారంలో వున్నా, లేకున్నా వేదనిలయం చుట్టు పక్కల ప్రాంతం కార్యకర్తలు, నేతల హడావుడితోనే వుండేది. ముఖ్య నేతలు, విశ్వాసపాత్రులైన ఐఏఎస్‌లకు సైతం ఈ ఇంటి లోపల ఎలా వుంటుందో తెలియదని చెబుతుంటారు.
 
సుమారు 20 వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఉండే ఈ వేద నిలయంలో 20 మందికి పైగా పనివాళ్లు పనిచేస్తుంటారు. అయితే, జయ మరణానంతరం ఇక వేద నిలయానికి అధికారయోగం వీడినట్టేనని ప్రతి ఒక్కరూ భావిస్తూ వచ్చారు. కానీ శశికళ అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడంతో మళ్లీ ఆ బంగ్లాకు రాజభోగం పట్టినట్టే. 
 
ఆ భవనంలో ఉండేవారికి రాజభోగం వరిస్తుందని కొందరు అన్నాడీఎంకే నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. జ్యోతిష్యం, వాస్తు, జాతకాలను విపరీతంగా విశ్వసించే జయ.. అన్నీ గ్రహించే ఆ భవనాన్ని నిర్మించారని, అందులో ఎవరు వున్నా అధికారమెక్కక తప్పదని వారు చెబుతున్నారు. ఆ కారణంగానే జయలలిత మరణం తర్వాత కూడా శశికళ ఆ భవనాన్ని వీడకుండా అక్కడే తిష్టవేసివున్నారు.