శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (11:58 IST)

బందీలుగా శశివర్గ ఎమ్మెల్యేలు.. నో ఫోన్.. నో పేపర్.. నో టీవీ.. 'మన్నార్గుడి' సెక్యూరిటీ నీడలో రిసార్ట్స్

అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు బందీలుగా మారిపోయారు. తొలిరెండు రోజున విలాసవంతమైన గోల్డన్ బే రిసార్ట్స్‌లో సేదతీరిన ఈ ఎమ్మెల్యేలకు మూడో రోజు నుంచి చుక్కలు కనిపిస్తున్నాయి. మొబైల్ ఫోన్‌ను తీసుకున్న మన్నార్గుడి

అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు బందీలుగా మారిపోయారు. తొలిరెండు రోజున విలాసవంతమైన గోల్డన్ బే రిసార్ట్స్‌లో సేదతీరిన ఈ ఎమ్మెల్యేలకు మూడో రోజు నుంచి చుక్కలు కనిపిస్తున్నాయి. మొబైల్ ఫోన్‌ను తీసుకున్న మన్నార్గుడి సెక్యూరిటీ ఇపుడు బయట జరిగే సమాచారం తెలియకుండా ఉండేలా వార్తా పత్రికలు, చివరకు రిసార్ట్స్‌లోని టీవీ ప్రసారాలను కూడా బంద్ చేశారు. దీంతో ప్రత్యక్షంగా జైలు జీవితాన్ని గడుపుతున్నట్టుగా భావిస్తున్నారు. 
 
తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం కోసం ఓ పన్నీర్ సెల్వం, శశికళలు పోటీ పడుతున్న విషయంతెల్సిందే. ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునేందుకు శశికళ వర్గం క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి పీఠంతో పాటు ఏకంగా జయలలిత వారసత్వాన్ని తన చేజిక్కించుకునేందుకు శశికళ శతవిధాలా ప్రయత్నిస్తోంది. 
 
మన్నార్ గుడి మాఫియాగా అప్రతిష్ట మూటకట్టుకున్న ఆమెకు ఆ అర్హత లేదని జయమ్మకు అత్యంత వీరవిధేయుడిగా, నమ్మిన బంటుగా సీఎం సీటు, పార్టీ ఆఫీస్‌లో జయ మరణంతో ఖాళీగా ఉన్న సీటు న్యాయంగా తనకే దక్కాలని పన్నీరు సెల్వం వాదిస్తున్నారు. అయితే వీరిరువురి ఆధిపత్య పోరులో పార్టీ ఎమ్మెల్యేలు నలిగిపోతున్నారు. శశికళ వర్గంలో ఉంటేనే తమకు భవిష్యత్ బాగుంటుందని ఎమ్మెల్యేలు తొలుత భావించారు. 
 
అయితే సీనియర్ నేతలందరూ శశికళ వర్గం నుంచి ఒక్కొక్కరిగా పన్నీరు సెల్వం పంచన చేరుతుండటంతో ఎమ్మెల్యేలు కూడా ప్లేటు ఫిరాయించాలని చూస్తున్నారు. దీంతో ఎక్కడ ఎమ్మెల్యేలు తనకు దూరమవుతారోనన్న ఉద్దేశంతో శశికళ అందరినీ ఓ హోటల్‌లో బంధించారు. అయితే కొందరు ఎమ్మెల్యేలను శశికళ బలవంతంగా నిర్భందించారనే వాదన కూడా వినిపిస్తోంది.
 
అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం శశికళ వర్గీయులు కొందరు ఆమె ఆదేశాలతో కొందరు ఎమ్మెల్యేలను బంధించినట్లు తెలుస్తోంది. రిసార్ట్స్ సెక్యూరిటీ గార్డుల స్థానంలో శశికళ అనుచరులు వారికి కాపలా కాస్తున్నారట. సాధారణంగా ఎమ్మెల్యేలు ఉన్న రిసార్ట్‌ ఎంట్రన్స్‌లో సెక్యూరిటీలు ఉంటారు. కానీ, కొందరు ఎమ్మెల్యేలు గోడ దూకి పారిపోతున్నారని తెలియడంతో శశికళ అనుచరులు గోడల చుట్టూ కాపలా కాస్తున్నట్లు తెలిసింది. 
 
అంతేకాదు, ఎమ్మెల్యేలకు బయట జరిగే పరిణామాలేవి తెలియకూడదనే ఉద్దేశంతో ఫోన్లకు సిగ్నల్స్ రాకుండా జామర్స్, నిరంతర గస్తీ ఏర్పాటు చేశారట. వైఫై సౌకర్యం కూడా అందుబాటులో లేకుండా స్విచ్చాఫ్ చేశారట. ఎమ్మెల్యేలు న్యూస్ పేపర్ కావాలని అడిగితే హోటల్ యాజమాన్యం ఇవ్వడానికి నిరాకరిస్తోందట. ఇలా గవర్నర్ ఏదో ఒక నిర్ణయం తీసుకునేంత వరకూ ఎమ్మెల్యేలు శశికళ నిర్భంధం నుంచి తప్పించుకునేలా లేరని విశ్వసనీయ వర్గాల సమాచారం.