శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 20 మార్చి 2017 (09:02 IST)

న్యాయం చేయకపోతే ప్రజలు కోరుకునే శిబిరంలో చేరుతా : శశికళ వర్గ ఎమ్మెల్యే హెచ్చరిక

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తన నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు 10 రోజుల్లో పరిష్కారం చూపించక పోతే ప్రజలు క

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తన నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు 10 రోజుల్లో పరిష్కారం చూపించక పోతే ప్రజలు కోరుకునే శిబిరంలో చేరుతానని హెచ్చరించారు. పైగా, ముఖ్యమంత్రి పళనిస్వామికి కూడా ఇకపై భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అదేసమయంలో ఆ ఎమ్మెల్యేను తమ వర్గంలోకి ఆహ్వానించేందుకు మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గం ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
కోయంబత్తూరు జిల్లా సూళూరు సెగ్మెంట్ పరిధిలోని పెరియకుయిలి అనే ప్రాంతంలో ఆనంద కుమార్‌ అనే వ్యక్తికి చెందిన గ్రానైట్ క్వారీ ఉంది. ఇక్కడ శుక్రవారం జరిగిన ప్రమాదంలో పళనికి చెందిన బాలన్, శక్తి వేలన్‌ కార్మికులు గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆ కుటుంబాలకు తలా రూ.3 లక్షలు ముట్టజెప్పి, సాధారణ ప్రమాదంగా మార్చేసి ఆ యాజమాన్యం చేతులు దులుపుకుంది.
 
ఈ సమాచారంతో ఎమ్మెల్యే కనకరాజ్‌ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఆదివారం ఆ క్వారీ పరిసరాల్లో పరిశీలించారు. అక్కడి ప్రజలు ఈ క్వారీ రూపంలో ఎదుర్కొంటున్న కష్టాలను, వారి గోడును విన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ క్వారీ రూపంలో తన నియోజకవర్గ ప్రజలకు తీవ్ర ఇక్కట్లు తప్పడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. పదేపదే ఫిర్యాదులు చేస్తున్నా, పట్టించుకునే వారు లేరని మండిపడ్డారు. ఇక, తానెవ్వరికీ భయపడే ప్రసక్తే లేదని, సీఎం పళనిస్వామికి కూడా భయపడనని స్పష్టం చేశారు.
 
క్వారీకి శాశ్వతంగా తాళం వేయడం, ఆ యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం లక్ష్యంగా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నట్టు తెలిపారు. పది రోజుల్లో న్యాయం జరగని పక్షంలో, ప్రజలు కోరుకునే శిబిరంలోకి చేరాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు తాను వెనక్కు తగ్గనని, చిన్నమ్మ శిబిరంకు గుడ్‌బై చెప్పి మరో శిబిరంలోకి వెళ్లడం ఖాయం అని స్పష్టం చేశారు. ఆయన ఆ ప్రకటన చేశారో లేదో ఆగమేఘాలపై మంత్రి ఉడుమలై కె.రాధాకృష్ణన్‌ కనకరాజ్‌ ఇంటికి చేరుకుని బుజ్జగించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.