అక్రమాస్తుల కేసు.. జయకు చుక్కెదురు.. త్వరలో తుదితీర్పు..!
ఆదాయానికి మించిన ఆస్తి కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు చుక్కెదురైంది. త్వరలో ఈ కేసులో తుది తీర్పు వెలువరించేందుకు అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భవానీ సింగ్ అనే వ్యక్తిని ప్రాసిక్యూటర్గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ డీఎంకే నేత అన్బగళన్ వేసిన పిటిషన్పై సోమవారం సుప్రీం తుది నిర్ణయాన్ని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో జయ కేసులో ప్రాసిక్యూటర్ నియామకంతో సంబంధం లేకుండా తీర్పు ఇవ్వాలని ముగ్గురు జడ్జిల నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పుపై విధించిన స్టేను సుప్రీం ఎత్తివేసింది. కేసులో ఇంతవరకు జరిగిన వాదనలు చాలని, కొత్తగా వాదనలు వినాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆ వాదనలతోనే తీర్పు వెల్లడించవచ్చని ఆదేశించింది.
కాగా కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించాల్సిన అవసరం తమిళనాడు ప్రభుత్వానికి లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. అంతేగాక ఆయన ద్వారా కర్ణాటక హైకోర్టులో జయ కేసుపై తాజా వాదనలు వినాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంది.