గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PYR
Last Modified: మంగళవారం, 27 జనవరి 2015 (10:08 IST)

‘సెల్పీ’ గోల్.. రైలు ముందు దూకబోయి... ముగ్గురు యువకులు బలి

సెల్పీ ఇప్పుడు ఇదో సరదా.. ఎక్కడికెళ్ళిన సరదాగా ఓ ఫోటోనో, ఓ వీడియోనో తీయడం నెట్ లో అప్ లోడ్ చేయడం. సోషల్ మీడియాలో అందరికీ పంచడం. కొందరికి ఇదో వ్యసనంగా కూడా మారింది. మరికొందరు సెల్ఫీలో సాహసాలు చేసి వాటిని అందరికీ షేర్ చేస్తుంటారు. కొందరు యువకులు ఓ సాహస దృశ్యాన్ని సెల్పీలో చిత్రీకరించబోయి మృత్యువాత పడ్డారు. కన్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. వివరాలిలా ఉన్నాయి. 
 
ఢిల్లీ, మొరాదబాద్, ఫరీదాబాద్లకు చెందిన నలుగురు మిత్రులు కలిసి రిపబ్లిక్ దినోత్సవం రోజున తాజ్మహల్ చూసేందుకు ఆగ్రా బయల్దేరారు. వీళ్లంతా 20-22 ఏళ్ల మధ్య వయసువాళ్లే. సరదాగా ఆగ్రాలో తాజ్ మహల్ అందాలని చూశారు. ఎంజాయ్ చేశారు. అయితే దారిలో రైల్వేట్రాక్ చూడగానే వారికి అక్కడ సాహసం చేయాలనిపించింది. అసలే కుర్రకారు. వెంటనే కారాపి, ఆ సాహసానికి సిద్ధమయ్యారు. 
 
అదేమిటంటే...వేగంగా వస్తున్న రైలు దగ్గర సెల్ఫీ తీసుకోడం, వెంటనే అక్కడ నుంచి దూకేయడం. రైలు రానే వచ్చింది. అయితే వారు రైలు వేగాన్ని లెక్కేయలేకపోయారు. దూకే లోపు రైలు వారిని ఢీకొంది.  యాకూబ్, ఇక్బాల్, అఫ్జల్ అనే యువకులు అక్కడికక్కడే చనిపోయారు. అనీష్ అనే నాలుగో అబ్బాయి  మాత్రం గాయాలతో బయట పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు పంపారు. అనీష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.