షీనా బోరా హత్య కేసులో కొత్తకోణం: 9 కంపెనీలు.. 900 కోట్లు.. ఈ డబ్బు ఏమైంది?
దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. షీనా బోరా ఖాతాలోకి మళ్లించిన డబ్బును... తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలో షీనా బోరాను అంతమొందించినట్టు సీబీఐ భావిస్తోంది. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితురాలైన తల్లి ఇంద్రాణి ముఖర్జియా, మీడియా టైకూన్ పీటర్ ముఖర్జియాలకు చెందిన విదేశీ ఖాతాలకు సంబంధించిన లావాదేవీల వివరాలను సేకరించే పనిలో సీబీఐ నిమగ్నమైంది.
ఇప్పటికే... షీనా బోరా హత్య కేసును సీబీఐ ఓ కొలిక్కి తెచ్చిన విషయం తెల్సిందే. దీనిపై సీబీఐ తరపు న్యాయవాది అనిల్ సింగ్ కోర్టుకు ఒక రిపోర్టును సమర్పించారు. షీనా బోరా హత్యకు ఆర్థిక అంశాలే కారణమని అందులో పేర్కొన్నారు. 9 కంపెనీలకు చెందిన రూ.900 కోట్ల రూపాయలను షీనా బోరా ఖాతాల నంచి మాయం చేశారని పేర్కొన్నారు. దీంతో పీటర్ ముఖర్జియా విదేశీ బ్యాంకు ఖాతాల లావాదేవీలకు సంబంధించి ఇంటర్పోల్ సాయం కూడా కోరుతున్నామని అతడి కస్టడీని పొడిగించాల్సిందిగా కోరారు. దీంతో పీటర్కు నవంబరు 30 వరకూ కస్టడీని కోర్టు పొడిగించింది.
ఇదిలావుండగా, పీటర్, ఇంద్రాణి భాగస్వాములుగా ఉన్న ఐఎన్ఎక్స్ మీడియా నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసి షీనా బోరా హెచ్ఎస్బీసీ (సింగపూర్) ఖాతాలోకి మళ్లించారు. అలాగే, సింగపూర్లోని హెచ్ఎస్బీసీ బ్యాంకులో ఇంద్రాణి ఖాతాను సింగపూర్లోని డీబీఎస్ బ్యాంకు ఉద్యోగిని గాయత్రి అహూజా సహకారంతో తెరిచింది. అయితే, 2009 మార్చిలో 9ఎక్స్ మీడియాలో జరిగిన అంతర్గత ఆడిట్లో.. పీటర్ ఇంద్రాణీ బాగోతం బయటపడింది. వీటన్నిటికీ సంబంధించిన ఆధారాలన్నీ సీబీఐకి లభ్యమయ్యాయి.