గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 14 సెప్టెంబరు 2014 (16:11 IST)

షీలా దీక్షిత్ యూ టర్న్ : అలా చెప్పలేదంటూ కామెంట్!

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మాట మార్చారు. 15 ఏళ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన షీలా, మొన్నటి ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఘోర పరాజయం పాలవడమే కాక, పార్టీ ఓటమికి కారణమయ్యారు. అయినా, కాంగ్రెస్ పార్టీ, ఆమెకు గవర్నర్ పదవినిచ్చి గౌరవించింది. 
 
మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత గవర్నర్ పదవికి రాజీనామా చేసిన షీలా దీక్షిత్, రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించాలని లెఫ్ట్ నెంట్ గవర్నర్‌కు సూచించడమే కాక, బీజేపీ సర్కారు ఏర్పడటమే ఢిల్లీ ప్రజలకు మంచిదంటూ వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్‌ లో ఒక్కసారిగా కలకలం రేగింది. పరిస్థితి మరింత చేజారిపోక ముందే దిద్దుబాటు చర్యలకు దిగిన షీలా, ఆదివారం మీడియా ముందుకు వచ్చారు. 
 
బీజేపీకి అనుకూలంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని షీలా దీక్షిత్ వివరించారు. అసలు బీజేపీకి అధికారం ఇవ్వాలంటూ తానెందుకు కోరతానని కూడా ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత బలం ఉంటే, బీజేపీకి వచ్చిన ఇబ్బందేమిటని మాత్రమే తాను వ్యాఖ్యానించానని చెప్పారు. 
 
ప్రజలెన్నుకున్న పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నానని, ఆ అర్హత బీజేపీకి ఉంటే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సబబేనని అన్నట్లు షీలాదీక్షిత్ చెప్పుకొచ్చారు.