శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 19 డిశెంబరు 2014 (13:06 IST)

ఉద్ధవ్ ఠాక్రే భద్రతా అధికారిపై శివసేన ఎమ్మెల్యే దాడి.. పరుగోపరుగు....

శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే భద్రతా అధికారిపై సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు దాడి చేసి, అనంతరం అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఎమ్మెల్యే పేరు హర్షవర్ధన్ జాదవ్. ఈయన మహారాష్ట్రలోని కన్నద్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే, భద్రతా అధికారిపై ఆయన దాడి చేయడానికి కారణమేంటనేగా మీ సందేహం.. అయితే, ఇది చదవండి. 
 
మహారాష్ట్ర మంత్రివర్గంలో చోటు పొందిన శివసేన మంత్రులతో ఉద్ధవ్ ఠాక్రే ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి ఎమ్మెల్యేలు ఎవరినీ కూడా అనుమతించవద్దని స్వయంగా ఠాక్రేనే పోలీసులకు చెప్పి మరీ వెళ్లారు. అదేసమయంలో అక్కడికి వచ్చిన జాదవ్, తాను శాసనసభ్యుడినని, లోపలికి అనుమతించాల్సిందేనని పట్టుబట్టాడు. 
 
అయితే ఠాక్రే ఆదేశాలతో తమరిని లోపలికి అనుమతించలేమని ఠాక్రే వ్యక్తిగత భద్రతా సిబ్బందిలోని ఇన్ స్పెక్టర్ పరాగ్ జాదవ్ తేల్చి చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే ఇన్‌స్పెక్టర్‌పై దాడి చేశారు. అనంతరం పరుగు లంఘించుకున్నారు. 
 
మరి సొంత పార్టీ అధినేత భద్రత సిబ్బందిపై దాడి చేసి అక్కడే ఉండగలడా? తీరా భేటీ తర్వాత ఇన్‌స్పెక్టర్ నుంచి ఫిర్యాదునందుకున్న ఠాక్రే, జాదవ్ కోసం ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదు. దీంతో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోండని ఆయన పోలీసులకు చెప్పేశారు. ఫలితంగా జాదవ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన కోసం గాలింపు చేపట్టారు. అయితే జాదవ్‌కు ఇదేమీ కొత్త కాదట.