శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 2 మార్చి 2015 (17:34 IST)

జేకే సీఎం ముఫ్తీ వ్యాఖ్యలు ఆర్మీకి అవమానం : శివసేన

జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ సాఫీగా, ప్రశాంతంగా ముగిసేందుకు పాక్ ఆక్రమిత ప్రజలు, ఉగ్రవాదులే కారణమంటూ ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ముఫ్తీ మొహ్మద్ సయ్యీద్ చేసిన వ్యాఖ్యలు దేశ ఆర్మీకి అవమానమని శివసేన అభిప్రాయపడింది. 
 
ఇదే అంశంపై శివసేన నేత సంజయ్ రావత్ ముంబైలో మాట్లాడుతూ, జమ్మూకాశ్మీర్ సీఎమ్మే కాదు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అది దేశ ఆర్మీకి తీవ్ర అవమానమన్నారు. భారత ప్రభుత్వానికి సైన్యం శక్తిపై నమ్మకముందన్నారు.
 
పాక్ సైన్యంతోనైనా, తీవ్రవాదులతో అయినా భారత సైనికులు పోరాడగలరని ఆయన స్పష్టం చేశారు. కాగా, పాకిస్థాన్, హురియత్ కాన్ఫరెన్స్ వల్లే ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ వ్యాఖ్యానించడం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.
 
అదీకూడా సీఎంగా ప్రమాణం చేసిన కొద్ది సేపటిలోనే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పక్కన ఉండగానే ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడాన్ని విపక్ష పార్టీలన్నీ తప్పుబడుతున్నాయి. ఇదే అంశంపై సోమవారం లోక్‌సభలో పెద్ద రభసే జరిగింది.