శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2014 (13:17 IST)

తెలంగాణలో ఆరుగురు రైతులు ఆత్మహత్య

తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్, ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పంటల నష్టంతో అప్పు బాధతో  ఆరుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
 
వరంగల్ జిల్లా గూడూరు మండలంలోని రాములుతండాకు చెందిన గిరిజన రైతు బానోతు ఈర్యా (42)కు రెండు ఎకరాల పొలం ఉంది. పంట సరిగా పండలేదు. అప్పుల బాధతోపాటు కూతురు పెళ్లి ఎలా చేయాలన్న మనోవేదనతో ఆదివారం పురుగుల మందు తాగి మృతి చెందాడు.
 
ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం ఎగ్గాం గ్రామానికి చెందిన రైతు చిన్నగంగన్న(45) తన భూమిలో పత్తి సరిగా మొలకెత్తలేదు. దీంతో రెండోసారి ధైర్యం చేసుకుని రూ.2 లక్షలు అప్పు తెచ్చి విత్తి, డీజిల్ ఇంజిన్ తెచ్చి వాగు నీటిని పంటకు పారించాడు. అయినా పంట నష్టం ఏర్పడడంతో, అప్పులు తీర్చే మార్గం కనిపించక శనివారం విషం తాగి ప్రాణాలు తీసుకున్నాడు. 
 
నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం పాశంవారిగూడేనికి చెందిన మారెడ్డి వెంకట్‌రెడ్డి (44) తన 15 ఎకరాల భూమితోపాటు మరో 15 ఎకరాలు కౌలు కు తీసుకుని పత్తి సాగు చేశాడు. రూ.5 లక్షల పెట్టుబడి పెట్టాడు. వర్షాభావం, తెగుళ్లతో పెట్టుబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బైరంపల్లి వాసి గోపాల్‌జీ(60) సాగు చేసిన వరి, పత్తి ఎండిపోవడంతో ఆదివారం కరెంటు తీగలను పట్టుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కొందుర్గు మండలం శ్రీరంగాపూర్‌కి చెందిన చిటికెల నర్సింహులు(30) పురుగుమందు తాగి ఉస్మానియా ఆస్పత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. 
 
అదేవిధంగా చిన్నఎల్కిచర్ల పంచాయతీ పరిధిలోని పుల్లప్పగూడెంకి చెందిన గొల్ల నర్సింహులు(30) పదెకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తి, మొక్కజొన్న పంటలు వేశాడు. రూ.రెండు లక్షలకు పైగా అప్పులు చేశాడు. పంటచేతికి రాకపోవడంతో చేసేది లేక, అప్పులు తీర్చే మార్గమూ కనిపించక శనివారం రాత్రి ఉరేసుకుని చనిపోయాడు.