రాహుల్ ఆవేశ పూరిత ప్రసంగం.. పొంగిపోయిన సోనియా!
పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ సోమవారం చేసిన ఆవేశపూరిత ప్రసంగం పట్ల కాంగ్రెస్ శ్రేణుల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా రైతుల సమస్యలను ఎత్తి చూపాడంటూ సహచర పార్టీ నేతలంతా రాహుల్ను మెచ్చుకుంటున్నారు. దీనిపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆనందాన్ని వెలిబుచ్చుతున్నారు. రాహుల్ను అందరూ మెచ్చుకోవడం తనకు ఆనందం కలిగిస్తోందన్నారు.
లోక్సభలో సోమవారం రాహుల్ ఆవేశపూరిత ప్రసంగం చేయడం మీడియాలో హైలైట్ అయిన విషయం తెల్సిందే. దీనిపై కాంగ్రెస్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్ బాగా మాట్లాడాడని సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు. దీంతో పార్టీ అధినేత్రిగా కంటే ఒక తల్లిగా సోనియా గాంధీ సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. రాహుల్ ప్రసంగాన్ని తాను పూర్తిగా వినలేదని, బాగా మాట్లాడాడని పార్టీ నేతలు చెప్పారన్నారు. అయితే, రాహుల్ మాట్లాడుతున్న సమయంలో సోనియాతో పాటు.. 15 మంది కాంగ్రెస్ ఎంపీలు సభకు హాజరుకాలేదు.
అంతకుముందు పార్లమెంట్ మలిదశ సమావేశాలు ప్రారంభమైన అనంతరం కేంద్ర ప్రభుత్వం భూసేకరణ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. దీనిపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ ఎన్డీయే రైతుల ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెల్సిందే. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్డీయే సర్కారు కాదని, సూటు బూటు ప్రభుత్వమని, పెట్టుబడి దారులు, ధనికులకు అనుకూలమైన ప్రభుత్వమన్నారు. రైతుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును లోక్సభలో ఆయన తూర్పారబట్టారు.
ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ బిల్లుతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యూపీఏ హయాంలో వ్యవసాయం అభివృద్ధి సాధించిందని, తమ హయాంలో అనేక పంటలకు మద్దతు ధర పెంచామని రాహుల్ గుర్తు చేశారు. అభివృద్ధి నినాదంతో అందలమెక్కిన ఎన్డీయే ప్రభుత్వం సాధించిందేమీ లేదని దుయ్యబట్టారు.
‘అచ్ఛే దిన్’ అనేది ఒక విఫల ప్రయోగమని వ్యాఖ్యానించారు. రైతులకు మద్దతు ధర కల్పించడంలో మోడీ సర్కార్ విఫలమైందని ధ్వజమెత్తారు. మోదీ పాలనలో వ్యవసాయాభివృద్ధి స్తంభించిపోతోందని, ఇప్పటి వరకు 1 శాతం మాత్రమే వృద్ధి రేటు నమోదైందని ఆరోపించారు. అదే యూపీఏ హయాంలో వ్యవసాయాభివృద్ధి 4.2 శాతంగా ఉందని రాహుల్ గాంధీ గుర్తు చేశారు.