మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 అక్టోబరు 2014 (07:07 IST)

కాంగ్రెస్ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం సన్నగిల్లింది: చిదంబరం మాట నిజమేనా?

కాంగ్రెస్ శ్రేణులలో ఆత్మస్థైర్యం సన్నగిల్లిందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైనాయి. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు పార్టీ శ్రేణులతో , మీడియాతో ఎక్కువగా మాట్లాడవలసిన అవసరం ఉందన్నారు. ఒక టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం అనేక విషయాలను ప్రస్తావించారు. 
 
ప్రస్తుతానికి పార్టీలో నెంబర్ ఒన్ స్థానం సోనియాగాంధీదే అయినా, భవిష్యత్తులో గాంధీయేతర కుటుంబానికి చెందిన నాయకుడు ఎవరైనా పార్టీకి నాయకత్వం వహించే అవకాశం లేకపోలేదని చిదంబరం జోస్యం చెప్పారు. 
 
అలాగే స్విస్ బ్యాంకుల్లో అక్రమ సంపాదనను దాచుకున్న వ్యక్తుల జాబితా విడుదలపై కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. బ్లాక్ మనీ లిస్టుకు సంబంధించిన జాబితా విడుదలపై తామేమీ భయపడట్లేదని చిదంబరం అన్నారు. 
 
సదరు జాబితాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కేంద్ర మాజీ మంత్రి ఉన్నారన్న దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లీకులు జారీ చేసిన సందర్భంగా చిదంబరం స్పందించారు. ‘జాబితాలో పేర్లున్న వ్యక్తులు భయపడతారు తప్పించి, పార్టీ ఎందుకు కలవరపడుతుంది? ఈ తరహా అక్రమాలు వ్యక్తిగతమైనవి’ అని చిదంబరం వ్యాఖ్యానించారు. 
 
‘నల్ల కుబేరుల వెల్లడిలో బీజేపీ ప్రభుత్వం మా మాదిరే వ్యవహరిస్తోంది. న్యాయపరంగా సర్కారు నిర్ణయం సరైనదే. అయితే మాపైనే తిరిగి నిందలేస్తూ తప్పు చేస్తోంది’ అని చిదంబరం వ్యాఖ్యానించారు.