శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 21 డిశెంబరు 2014 (11:43 IST)

ఉజ్జయినిలో టాయ్‌లెట్ నుంచి లాగి.. ఢిల్లీలో బర్త్‌డే రోజున గ్యాంగ్ రేప్‌లు!

దేశంలో మహిళలపై అత్యాచారాలు ఏమాత్రం ఆగడం లేదు. నిర్భయ వంటి కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ సామూహిక అత్యాచారాలు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ ఉజ్జయిని, ఢిల్లీ నగరాల్లో రెండు అత్యాచారాలు వెలుగులోకి వచ్చాయి. ఇండోర్‌లో టాయ్‌లెట్‌లో ఉన్న ఓ యువతిని బయటకు లాగి అత్యాచారం చేయగా, ఢిల్లీలో పుట్టిన రోజు వేడుకలకు వచ్చిన స్నేహితులై కామాంధులుగా మారి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసుల వివరాలను పరిశీలిస్తే.... 
 
మధ్యప్రదేశ్‌ దేవస్‌ జిల్లాకు చెందిన 18 ఏళ్ల విజేంద్ర రాజ్‌పుత్‌, మరో మైనర్‌ (17 ఏళ్లు) కలిసి ఉజ్జయినిలోని రంగ్‌బవాదీ ప్రాంతంలో ఓ ఇంట్లో నివసిస్తున్నారు. ఇదే ఇంట్లోని మరో పోర్షన్‌‍లో బాధితురాలు కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెను తమ గదికి వచ్చి కంపెనీ ఇవ్వాల్సిందిగా వారు ఆ అమ్మాయిని అడిగారు. అయితే ఆమె నిరాకరించడంతో.. చిర్రెత్తుకొచ్చిన ఆ ముగ్గురు టాయిలెట్లోకి వెళ్లిన ఆమెను లాగి.. గదిలో బంధించి అకృత్యానికి పాల్పడ్డారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురు కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులు కావడం గమనార్హం. 
 
అలాగే, ఢిల్లీలో 18 యేళ్ళ యువతిపై అత్యాచారం జరిగింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆ యువతి ఢిల్లీలో ఓ చిన్న కంపెనీలో పనిచేస్తోంది. అదే కంపెనీలోనే పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాహుల్‌ (20), మరో 17 ఏళ్ల యువకుడు పనిచేస్తున్నారు. శుక్రవారం బాధితురాలి పుట్టిన రోజు విషయం తెలుసుకున్న ఆమె స్నేహితులిద్దరూ.. సంతోషంగా పుట్టినరోజు వేడుకలు చేసుకుందామంటూ తమ గదికి తీసుకెళ్లి సామూహిక మానభంగానికి పాల్పడ్డారు. రెండు సంఘటనలపై ఆయా ప్రాంత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.