శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 22 అక్టోబరు 2014 (09:20 IST)

రాజపక్షేకు భారతరత్న: తమిళులను రెచ్చగొట్టేందుకే మోడీకి స్వామి లేఖనా?

శ్రీలంక అధినేత మహీందా రాజపక్సేకు భారతరత్న అవార్డు ఇవ్వాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి లేఖ రాయడం వెనుక.. కేవలం తమిళులను రెచ్చగొట్టడమే ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఎల్టీటీఈని అంతమొందించడంలో రాజపక్సే పాత్రను ప్రపంచ దేశాలు సైతం ప్రశంసించాయి. 
 
కానీ, తమిళులు మాత్రం ఆయనను తమిళ వ్యతిరేక ద్రోహిగా చిత్రీకరించాయి. ఫలితంగానే తమిళనాడులో ఆయనకు వ్యతిరేకంగా ప్రతి నిత్యం ఏదో ఒక ఆందోళన కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. చెన్నైలోని శ్రీలంక రాయబార కార్యాలయం ఎదుట ఈ తరహా సంఘటనలు ప్రతి రోజూ చూస్తునే ఉంటాం. అందుకే ఇక్కడ పదుల సంఖ్యలో పోలీసు బలగాలు మొహరించి వుంటాయి. 
 
ఈ నేపథ్యంలో.. మహీందా రాజపక్సేకు భారతరత్న అవార్డు ఇవ్వాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సుబ్రమణ్య స్వామి లేఖ రాయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖలో భారత అంతర్గతభద్రతకు పెనుముప్పుగా మారిన ఎల్టీటీఈని రాజపక్సే సమర్థవంతంగా మట్టుబెట్టారన్నది స్వామి వాదన. ఇది నిజమే. 
 
అయితే, సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఈ విజ్ఞప్తి ఎల్టీటీఈని అభిమానించే తమిళులకు ఆగ్రహం తెప్పించే విషయమైనప్పటికీ.. ఆయన మాత్రం గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. కేవలం తమిళులను రెచ్చగొట్టమే ధ్యేయంగా సుబ్రమణ్య స్వామి ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది.