గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 21 మే 2015 (12:22 IST)

మతిమరుపు వల్లే అలా జరిగింది : సుబ్రహ్మణ్య స్వామి వివరణ

‘పెళ్లికొడుకునీ, పెళ్లికుమార్తెను ఆశీర్వదించేందుకు వచ్చిన బీజేపీ సీనియర్ నేత డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ఏకంగా పెళ్లి కుమార్తె మెడలో తాళి కట్టబోయారు. దీంతో ఒక్కసారి అవాక్కయిన వారంతా స్వామిని వారించడంతో ఆయన తేరుకున్నారు. ఈ సంఘటన ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృతంగా ప్రసారం చేశారు. 
 
తమిళనాడులో బీజేపీ కార్యకర్త వివాహానికి ఆయన వెళ్లారు. పాపం పెద్దాయన ఢిల్లీ నుంచి పెళ్లి చూడ్డానికి వచ్చాడు కదాని అక్కడున్నవారు ఆయన చేతికి తాళిబొట్టు ఇచ్చి ఆశీర్వదించమని కోరారు. ఆ మంగళసూత్రాన్ని భక్తిగా కళ్లకద్దుకోవడం వరకూ పద్ధతి ప్రకారమే చేసిన సుబ్రమణ్యస్వామి.. పర ధ్యాసలో ఉంటూ వరుడికి ఇవ్వాల్సింది పోయి తానే వధువు మెడలో కట్టేందుకు సిద్ధమైపోయారు. మంగళసూత్రాన్ని దాదాపుగా వధువు మెడ వద్దకు తీసుకెళ్లారు. ఇంకొక్క క్షణం ఉంటే కట్టేసేవారేమో కూడా. 
 
కానీ.. పక్కనే ఉన్న ఆమె సన్నిహితురాలు, మాజీ ఐఏఎస్ అధికారిణి చంద్రకళ చాలా వేగంగా స్పందించి సుబ్రహ్మణ్య స్వామి చేతిని తట్టి, తాళిబొట్టును వరుడి చేతికి ఇవ్వాల్సిందిగా సైగ చేశారు. తప్పు తెలుసుకుని నాలుక్కరుచుకున్న సుబ్రమణ్యస్వామి నవ్వుతూ ఆ మంగళసూత్రాన్ని వరుడికి ఇచ్చారు. దీంతో పెళ్లిపెద్దలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆయన నిర్వాకాన్ని తల్చుకుని అక్కడున్నవారంతా ముసిముసి నవ్వుల పువ్వులు పూయించారు. అయితే, దీన్ని మీడియా పెద్దది చేసి చూపడంపై ఆయన స్పందించారు. తనకున్న మతిమరుపు వల్లే అలా జరిగిందని చెప్పుకొచ్చారు.