శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 28 జులై 2016 (13:10 IST)

గాంధీజీ హత్య కోసం పిస్టల్‌ను ఇటలీ నుంచి తెచ్చారా? 15 తర్వాత బహిర్గతం చేస్తా : సుబ్రమణ్య స్వామి ట్వీట్

మహాత్మా గాంధీ హత్య కోసం వినియోగించిన పిస్టల్ ఇంటలీ నుంచి కొనుగోలు చేసి తెచ్చారని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి మరో బాంబు పేల్చారు.

మహాత్మా గాంధీ హత్య కోసం వినియోగించిన పిస్టల్ ఇంటలీ నుంచి కొనుగోలు చేసి తెచ్చారని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి మరో బాంబు పేల్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈనెల 15వ తేదీ నుంచి బయటపెట్టబోతున్నట్టు ఆయన గురువారం ట్వీట్ చేశారు. 
 
గాంధీజీని గాడ్సేతో పాటు ఇతరులు హత్య చేశారని, హత్య కోసం వాడిన పిస్టల్‌ను ఇటలీ నుంచి తెప్పించారని ఆ ట్వీట్‌లో స్వామి పేర్కొన్నారు. అంతేకాకుండా ఇటలీకి చెందినవారు ప్రేరేపించడంతోనే గాంధీ హత్య జరిగిందనే అనుమానాలు కలిగేలా ఆ ట్వీట్‌లో పదాలను ఆయన వినియోగించారు. ఇటాలియన్ ప్రభావం ఎవరి ద్వారా జరిగింది? అని ప్రశ్నార్థకాన్ని ఆ ట్వీట్‌లో ఉంచారు. ఆగస్టు 15 తర్వాత న్యూఢిల్లీలో విలేకర్ల సమావేశం నిర్వహిస్తానని, మహాత్మా గాంధీ హత్య గురించి పూర్తి వివరాలను వెల్లడిస్తానని తెలిపారు. 
 
కాగా, మహాత్మా గాంధీ హత్య గురించి పార్లమెంటులో చర్చించాలని సుబ్రహ్మణ్యం స్వామి గత వారం డిమాండ్ చేశారు. పార్లమెంటేరియన్లు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో తప్పనిసరిగా చర్చ జరపాలని కోరారు. 1948 జనవరి 30న మహాత్మాగాంధీ హత్య జరిగింది. ఈ కేసులో నాథూరాం గాడ్సే, నారాయణ్ ఆప్టేలను ఉరి తీశారు. నాథూరాం గాడ్సే ఆరెస్సెస్‌ కార్యకర్త అని ఆయన సోదరుడు చెప్తూండటాన్ని ఆరెస్సెస్ అనేకసార్లు ఖండించింది.