భారత ఆచారాల్లో సుప్రీంకోర్టు జోక్యం అభ్యంతరకరం : రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్
భారత సంప్రదాయాలు, ఆచారాల్లో సుప్రీంకోర్టు జోక్యం అభ్యంతరకరమని రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. కేరళలోని ప్రఖ్యాత శబరిమల దేవాలయంలో మహిళలకు ప్రవేశం కల్పించే అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే అంశంపై ఆయన పై విధంగా స్పందించారు.
ప్రాచీన హిందూ సంప్రదాయాలు, విలువలను గౌరవించాలని కోరారు. 22 ఏళ్లుగా అంతరాయం లేకుండా శబరిమలను దర్శిస్తున్న ఒక భక్తుడిగా.. పూర్వకాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయాలు, ఆచారాల్లో సుప్రీంకోర్టు జోక్యాన్ని అభ్యంతరకరంగా భావిస్తున్నట్లు చెప్పారు.
ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని జనవరి 11న సుప్రీం కోర్టు విచారించింది. రుతుక్రమంలో ఉన్న మహిళలను ఆలయం ప్రవేశం చేయకుండా నిషేధించడం రాజ్యాంగ విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
మహిళలకు ఎందుకు ఆలయ ప్రవేశం కల్పించడం లేదనే ప్రశ్నకు స్పందించిన ఎంపీ చంద్రశేకర్... చాలా సందర్భాల్లో పూర్వకాలపు సంప్రదాయాలు, ఆచారాలు నవీన పద్ధతులు, పరీక్షలను అంగీకరించవని.. వాటిని గౌరవించాలని అన్నారు.