శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , మంగళవారం, 10 జనవరి 2017 (06:29 IST)

ఒక్క రోజులో ఇన్ని నియామకాలా.. చెల్లవు గాక చెల్లవన్న సుప్రీం కోర్టు

తమిళనాడు పబ్లిక్ సర్వీసు కమిషన్‌లో అసాధారణ నియామకాలపై సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. ఒకే ఒక్క రోజులో రాజ్యాంగ పదవుల్లో భారీస్థాయి నియామకాలు రాజ్యంగ విధివిధానాలకు విరుధ్ధమైనవని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.  తమిళనాడు ప్రభుత్వం గత సంవత్సరం పబ్లిక్ సర్వీసు కమిషన్‌లో ఉన్నఫళాన నియమించిన 14 మంది నియామకాల్లో 11 నియామకాలు చెల్లవని గత సంవత్సరం జనవరి 31న మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించడానికి సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. పైగా ఈ 11 మంది నియామకాలను తాజాగా చేపట్టాలని తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది.
 
రాజ్యాంగ పదవులకు నియామకాల విషయంలో జోక్యం చేసుకోవడానికి న్యాయవ్యవస్థకు గల అధికారంపై అటార్నీజనరల్ ముకుల్ రోహ్‌తగీ లేవనెత్తిన ప్రశ్నను ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాజ్యాంగ పదవుల నియామకం పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనిదేనని మేము అంగీకరిస్తాము. కానీ ఒకే ఒక్క రోజు ఉన్నఫళాన 11 రాజ్యాంగ పదవులకు నియామకాలను  చేపట్టడం చెడు సంప్రదాయమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. 
 
తమిళనాడు ప్రభుత్వం గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు చేసిన 11 నియామకాల్లో  ఆరుగురు లాయర్లని, వీరు పాలక ఏఐడీఎంకేకి సన్నిహితులని పేర్కొంటూ డీఎంకే సభ్యుడు టికెఎస్ ఎలాంగోవన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. వీరిలో ఒక జిల్లా జడ్జి కూడా ఉన్నారు. ఈయన పదవీ పొడిగింపును హైకోర్టు తోసిపుచ్చింది. నియామకం జరిగిన మరో ఐఏఎస్ అధికారి ప్రవర్తనా రిపోర్టులో పూర్తిగా రిమార్కులుండటంతో అతని సమగ్రత ప్రశ్నార్థకమయిందని ఎలాంగోవన్ వాదించారు. 
 
వాద ప్రతివాదాల అనంతరం గత డిసెంబర్ 22న మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో.. ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుండి ఇన్ని నియామకాలను భర్తీ చేసిందని. ఎంపిక చేసిన వారిని.. వారి జీవిత వివరాలను మాత్రమే సమర్పించాలని కోరారని వ్యాఖ్యానిస్తూ వారి నియామకాలపై స్టే విధించింది.
 
హైకోర్టు తీర్పుని వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అటార్ని జనరల్ ముకుల్ రోహ్‌తగి వాదిస్తూ సభ్యుల అర్హత మినహా ఈ నియామకాలకు రాజ్యాంగం ఎలాంటి ఆంక్షలూ విధించలేదన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అందుకు సమాధానమిస్తూ అంటే మీరు ఎవరినైనా నియమించగలరని దీని అర్థమా, ఆ పోస్టుకు ఆ వ్యక్తి తగునా, తగరా అని మీకు పరిశీలించరా అని ప్రశ్నిస్తూ పిటీషన్‌ని కొట్టి వేసింది.