గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (12:06 IST)

దీపావళి బోనస్ రూ. 4 లక్షల విలువచేసే నగలు, కార్లు, ఫ్లాట్లు

దీపావళి పండుగ అంటే చిన్న పిల్లలకు కొత్త బట్టలు.. బాణాసంచా.. ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో ఇచ్చే బోనస్‌లు. అవీ నెల జీతమో లేక పర్సెంటేజ్ లెక్కనో అందుతుంది. అదే బోనస్ నాలుగు లక్షలు ఇస్తే. అబ్బా ఇంకేముంది కొట్టింది లక్కు అనుకుంటాం. అదే జరిగింది మరి. సూరత్‌లో ఒక వజ్రాల వ్యాపారి తన ఉద్యోగులకు ఏకంగా రూ. 4 లక్షల విలువ చేసే వస్తువులను దీపావళి కానుకగా అందించి హుందాతనాన్ని చాటుకున్నారు.
 
వివరాల్లోకి వెళితే... సూరత్‌కు చెందిన సేట్ పాల్కి సవ్జీభాయ్ ధోలాకియా. ఈయనకు సూరత్‌లో ఒక వజ్రాల ఎగుమతుల సంస్థ ఉంది. అందులో 6000 మంది ఉద్యోగులున్నారు. వీరు కాక ముంబైలోనూ, ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల్లో కలిపి మరో 3000 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో లక్ష్యాలను సాధించిన 1200 మందికి రూ. 4 లక్షల విలువ చేసే బహుమతి ఇవ్వాలని సవ్జీభాయ్ నిర్ణయించుకున్నారు. అందు కోసం రూ. 50 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. 
 
దీపావళి సందర్భంగా స్వీట్లు.. టపాసులు పంచిపెట్టినట్లు.. 491 మందికి ఫియట్ పుంటో కార్లు.. 200 మందికి 2బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ల తొలి చెల్లింపులు... 525 మందికి వారు కోరుకున్న బంగారు ఆభరణాలను కానుకగా ఇచ్చారు. ఇది తాను వారికి ఇస్తున్న బోనస్, ఇన్సెంటివ్ కాదని.. సంస్థ అభివృద్ధి కోసం తపించిన వారి అంకితభావానికి, నైపుణ్యానికి తగిన బహుమతులని సవ్జీభాయ్ పేర్కొన్నారు.