మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (11:15 IST)

సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు.. సైన్యం మొహరింపు.. గ్రామాలు ఖాళీ చేయిస్తున్న ఇండియన్ ఆర్మీ

భారత్, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్థాన్ నుంచి దాడులు జరగవచ్చని భారత్ భావిస్తోంది. దీంతో సరిహద్దులోని ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను ఖాళీ చేయించాల‌ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌న

భారత్, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్థాన్ నుంచి దాడులు జరగవచ్చని భారత్ భావిస్తోంది. దీంతో సరిహద్దులోని ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను ఖాళీ చేయించాల‌ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇప్ప‌టికే ఆదేశాలు జారీచేశారు. ఫలితంగా సరిహద్దుల్లోని వెయ్యి గ్రామాల ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు భారత్ తన సరిహద్దు వెంబడి భారీగా దళాలను మోహరించింది. రంగంలోకి దిగిన ఎయిర్‌ఫోర్స్ విమానలు గస్తీ కాస్తున్నాయి. ఇంకోవైపు సరిహద్దు భద్రతపై కేంద్ర కేబినెట్ కమిటీ నేడు భేటీకానుంది.
 
ఇదిలావుండగా, అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఆయా ప్రాంతాల్లో భ‌ద్ర‌త‌ను ప‌ర్య‌వేక్షిస్తోన్న‌ భార‌త సైనికులు అక్క‌డి పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో సైనిక‌ శిబిరాల ఏర్పాటు చేసుకుంటున్నారు. పంజాబ్‌లో గురుద్వార‌లోనూ సైనికులు శిబిరాలు ఏర్పాటయ్యాయి. స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లో ప్ర‌క‌టించిన హై అల‌ర్ట్ కొన‌సాగుతోంది. 
 
పంజాబ్‌లో 10 కిలో మీటర్ల మేర ప్రజలను ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఖాళీ చేయించిన‌ట్లు తెలుస్తోంది. సరిహద్దు వద్ద చోటు చేసుకుంటున్న పరిణామాలపై, ఆయా ప్రాంతాల్లో తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై రాజ్‌నాథ్ సింగ్ ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నారు. 
 
మరోవైపు... భారత దళాల సర్జికల్ స్ట్రయిక్స్ విషయం బయటకొచ్చిన తర్వాత భారత్-పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం నుంచి ఉద్రిక్తతలు క్షణక్షణం పెరుగుతూనే ఉన్నాయి. ఏ క్షణాన్నైనా యుద్ధం జరిగే అవకాశమున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ఇరు దేశాల సైన్యాలు అప్రమత్తంగా ఉన్నాయంటూ బ్రేకింగులు వచ్చాయి.