శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 11 నవంబరు 2016 (09:58 IST)

అమ్మ ఆస్పత్రిలో చేరి గురువారానికి 50 రోజులు.. మరో నెల రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిందేనా?

తమిళనాడు సీఎం జయలలిత చెన్నై ఆస్పత్రిలో చేరి గురువారానికి 50 రోజులు పూర్తయ్యాయి. డీహైడ్రేషన్‌తో గత సెప్టెంబర్ 22వ తేదీన అపోలో చేరిన జయలలితకు వైద్యుల బృందం మెరుగైన చికిత్స అందిస్తోంది. జయకు చికిత్స అంది

తమిళనాడు సీఎం జయలలిత చెన్నై ఆస్పత్రిలో చేరి గురువారానికి 50 రోజులు పూర్తయ్యాయి. డీహైడ్రేషన్‌తో గత సెప్టెంబర్ 22వ తేదీన అపోలో చేరిన జయలలితకు వైద్యుల బృందం మెరుగైన చికిత్స అందిస్తోంది. జయకు చికిత్స అందించడానికి లండన్‌ నుంచి ప్రముఖ వైద్యుడు రిచర్డ్‌, ఢిల్లీ ఎయిమ్స్‌ నుంచి ప్రత్యేక వైద్య బృందం వచ్చి ప్రత్యేక వైద్యసేవలు అందించారు. అపోలో వైద్యులు విడుదల చేసిన తదుపరి హెల్త్‌ బులెటిన్‌లలో ఈ విషయం ప్రకటించారు.
 
జయలలిత ఆస్పత్రిలో చేరిన రోజు నుంచి ఆమె త్వరగా కోలుకోవాలంటూ ప్రతీరోజూ అన్నాడీఎంకే నేతలు, మంత్రులు, శాసనసభ్యులు హోమాలు, పూజలు చేస్తున్నారు. ఇంకా అపోలో ఎదుట అయితే ప్రతీరోజూ రకరకాల పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. జయలలితను ఈనెల ఏడోతేదీ తర్వాత డిశ్చార్జి చేసే అవకాశం ఉందని వార్తలొచ్చాయ్. కానీ ఆమె మెల్లమెల్లగా కోలుకుంటుందని.. మరో నెల రోజుల పాటు ఆస్పత్రిలో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.
 
మరికొన్ని రోజుల పాటు అమ్మ ఆస్పత్రిలోనే ఉంటే మంచిదని, బయట వాతావరణంలోకి వస్తే మళ్లీ ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉందని అన్నాడీఎంకే శ్రేణులు భావిస్తున్నాయి. ఇంటికి వెళ్లారంటే జయలలిత ఊరికే ఉండరని, మళ్లీ పూర్తిగా పనుల్లో నిమగ్నం అవుతారని, అందువల్ల ఆమె అలసిపోయే అవకాశం ఉన్నందున మరికొన్నాళ్ల పాటు ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకుంటే మంచిదని పొన్నియన్ అన్నారు. కృత్రిమ శ్వాస పరికరాలను తొలగించిన వెంటనే ఆమె తనంతట తానుగా కూర్చోలేకపోతున్నారని, ప్రస్తుతం ఘన-ద్రవం లాంటి పదార్థాలు తీసుకుంటున్నారని వైద్యులు తెలిపారు. 
 
ఇప్పుడు కూడా వైద్యులు, ఫిజియోథెరపిస్టులు, నర్సులు తప్ప వేరే ఎవ్వరినీ జయలలిత చికిత్స పొందుతున్న సీసీయూ (క్రిటికల్ కేర్ యూనిట్) లోపలకు అనుమతించడం లేదు. అక్కడి నుంచే ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తన సలహాదారులతో ప్రత్యేకమైన ఆడియో వ్యవస్థ ద్వారా మాట్లాడుతున్నారని పొన్నియన్ చెప్పారు.