పన్నీర్ ద్రోహి... డీఎంకేతో చేతులు కలిపి అమ్మను మోసం చేశారు: సీఎం పళనిస్వామి
మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం నిజ స్వరూపం అసెంబ్లీలో బయటపడిందని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అన్నారు. అమ్మ జయలలితకు, అన్నాడీఎంకే పార్టీకి పన్నీర్ తీరని ద్రోహం చేశారంటూ నిప్పులు చెరిగారు.
మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం నిజ స్వరూపం అసెంబ్లీలో బయటపడిందని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అన్నారు. అమ్మ జయలలితకు, అన్నాడీఎంకే పార్టీకి పన్నీర్ తీరని ద్రోహం చేశారంటూ నిప్పులు చెరిగారు. శత్రువర్గమైన డీఎంకేతో చేతులు కలిపి, పెద్ద తప్పు చేశారని మండిపడ్డారు. జయ సమాధి వద్ద చిన్నమ్మ శశికళ చేసిన శపథం నెరవేరిందని అన్నారు. పార్టీని కాపాడుకున్నామని చెప్పారు. ఇప్పుడు అమ్మ ఆత్మకు శాంతి లభిస్తుందని తెలిపారు.
తమిళనాడు అసెంబ్లీలో జరిగిన నాటకీయ పరిణామాల అనంతరం బలపరీక్షలో ముఖ్యమంత్రి పళనిస్వామి నెగ్గిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన తన మంత్రివర్గ సభ్యులతో కలిసి విజయగర్వంతో చెన్నై మెరీనా బీచ్ వద్ద ఉన్న అమ్మ జయలలిత సమాధి వద్దకు చేరుకున్నారు. అమ్మ సమాధిపై పుష్పగుచ్చాలు ఉంచి ఆమెకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో విపక్షాల ప్రవర్తన చాలా బాధాకరంగా ఉందన్నారు. ఎంజీఆర్, జయలలిత ఆశయాలను తమ ప్రభుత్వం సాధిస్తుందన్నారు. అమ్మ బాటలోనే నడుస్తూ, అమ్మ పథకాలను కొనసాగిస్తామన్నారు. చివరకు ధర్మమే గెలిచిందని ఈ సందర్భంగా మంత్రులు వ్యాఖ్యానించారు. అమ్మ ఆశయాలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తామని తెలిపారు. బలపరీక్ష నెగ్గడంతో పళనిస్వామి వర్గ సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.