శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (15:28 IST)

పన్నీర్ రాజీనామాకు ఓకే.. శశికళ పట్టాభిషేకానికి ముహుర్తమెపుడు.. గవర్నర్ చేతిలో కీ!

తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు క్షణానికో మలుపు తిరుగుతున్నాయి. తన వ్యక్తిగత కారణాల రీత్యా ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు సీఎం ఓ.పన్నీర్ సెల్వం రాష్ట్ర గవర్నర్‌కు రాసిన లేఖపై ఆమోదముద్ర పడింది.

తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు క్షణానికో మలుపు తిరుగుతున్నాయి. తన వ్యక్తిగత కారణాల రీత్యా ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు సీఎం ఓ.పన్నీర్ సెల్వం రాష్ట్ర గవర్నర్‌కు రాసిన లేఖపై ఆమోదముద్ర పడింది. దీంతో పన్నీర్ సెల్వం ఇపుడు మాజీ సీఎంగా మారిపోయారు. అదేసమయంలో తదుపరి ముఖ్యమంత్రిగా పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళను ఎన్నుకున్నారు. ఇక్కడే అసలు సమస్య ఉత్పన్నమైంది. 
 
తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ పేరును ప్రతిపాదిస్తూ ఏఐఏడీఎంకే పార్టీ నిర్ణయం తీసుకోవడం కేంద్రప్రభుత్వానికి రుచించడం లేదు. ముఖ్యంగా శశికళ సీఎం కావడం ప్రధాని నరేంద్ర మోడీకి ఏమాత్రం ఇష్టం లేదు. ప్రస్తుత పరిస్థితులు, వస్తున్న ఊహాగానాలను చూస్తే అలాగే కనిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ మరి కొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయాలని భావిస్తుండగా... సరిగ్గా ఇదే సమయంలోగవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు తమిళనాడులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. 
 
శశికళను సీఎంగా కూర్చోబెట్టాలని ఏఐఏడీఎంకే పార్టీ నిర్ణయించిన కొద్ది సేపటికే గవర్నర్‌ను తక్షణం ఢిల్లీకి రావాల్సిందిగా కేంద్రం నుంచి ఆదేశాలు అందాయి. దీంతో ఆదివారం ఉదయమే కుటుంబ సమేతంగా ఊటీ పర్యటనకు వెళ్లిన ఆయన హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. ఒక్కసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయని శశికళ ఏకంగా సీఎం పీఠంపై కూర్చోనుండటంపై ప్రతిపక్ష పార్టీలతో పాటు, అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. 
 
పైగా, ఇప్పటికిప్పుడు సీఎం పన్నీర్ సెల్వంను తప్పించాల్సిన అవసరం ఏమొచ్చిందని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రశ్నించింది. శశికళ మొదటి నుంచి సీఎం పీఠంపైనే దృష్టిపెట్టి పావులు కదిపారని విమర్శించింది. ఆమెను ముఖ్యమంత్రిగా చేసేందుకు పార్టీ ఎమ్మెల్యేలంతా సిద్ధమైప్పటికీ.. ప్రమాణం చేసే ముహూర్తం ఎప్పుడన్నది మాత్రం గవర్నర్ చేతిలోనే ఉంది. 
 
గవర్నర్ ఓ కేంద్ర మంత్రి కుమారుడి వివాహం కోసం వెళ్లారని చెబుతున్నప్పటికీ... తమిళనాడు పరిస్థితులపై కేంద్ర హోంశాఖతో ఆయన చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే తమిళనాడు పరిస్థితులపై నివేదిక కూడా అందించారని చెబుతున్నారు. దీంతో శశికళను సీఎం అభ్యర్థిగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నప్పటికీ.. ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించే తేదీని మాత్రం గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు వెల్లడించాల్సి ఉంది.