శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (06:59 IST)

రాత్రి షిప్టుల్లో బలవంతంగా పనిచేయిస్తున్నారు.: ఇన్ఫోసిస్‌పై మహిళా టెక్కీల ధ్వజం

రెండు రోజుల క్రితం పుణేలోని ఇన్పోసిస్ ఆఫీసులో రసిలా రాజు అనే మహిళా ఉద్యోగినిని ఆఫీసు సెక్యూరిటీ గార్డు కిరాతకంగా హత్య చేసిన నేపథ్యంలో క్యాంపస్ లోని ఉద్యోగినులు సంస్థపై మండిపడుతున్నారు. బలవంతంగా ఒంటరిగా ఆఫీసులో రాత్రి పూట షిఫ్టులో మహిళలచే పనిచేయిస్తున

రెండు రోజుల క్రితం పుణేలోని ఇన్పోసిస్ ఆఫీసులో రసిలా రాజు అనే మహిళా ఉద్యోగినిని ఆఫీసు సెక్యూరిటీ గార్డు కిరాతకంగా హత్య చేసిన నేపథ్యంలో క్యాంపస్ లోని ఉద్యోగినులు సంస్థపై మండిపడుతున్నారు. బలవంతంగా ఒంటరిగా ఆఫీసులో రాత్రి పూట షిఫ్టులో మహిళలచే పనిచేయిస్తున్న ఇన్ఫోసిస్‌కు, మహిళా సిబ్బందికి గత కొంతకాలంగా ఘర్షణ జరుగుతోందని తెలిసిన సందర్భంలో ఇన్ఫోసిస్ మహిళల భద్రత విషయంలో  చూపిస్తున్న నిర్లక్ష్యం పట్ల విస్తృతస్థాయిలో చర్చ మొదలైంది.
 
ఐటీ కంపెనీల్లో వారాంతపు దినాల్లో (శని, ఆదివారాలు) ఆఫీసులు దాదాపు ఖాళీగా ఉన్న సమయాల్లో రాత్రిపూట పనిచేయడం మహిళా సిబ్బందికి ఏమాత్రం ఇష్టం లేకున్నప్పటికీ ఇన్ఫోసిస్ బలవంతంగా వారిచేత పనిచేయిస్తోందని తెలుస్తోంది. ఈ విషయమై ఉద్యోగినులు తమ మేనేజర్లు, మానవ వనరుల శాఖ వద్దకు తీసుకుపోయినా వారు పట్టించుకోవడం లేదని పైగా ఉద్యోగంలోకి తీసుకున్నప్పుడు రాత్రిపూట కూడా పనిచేస్తామని అంగీకరించారు కదా చేయవలసిందే అంటున్నారని మహిళా సిబ్బంది ఆరోపిస్తున్నారు. 
 
పుణేలోని ఇన్పోసిస్ క్యాంపస్‌లో ఆఫ్‌షోర్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో పనిచేస్తున్న ఒక ఉద్యోగిని మీడియాతో మాట్లాడుతూ రాత్రి షిఫ్టులో ఒంటరిగా పనిచేయనని చెపితే మా హెచ్ ఆర్ షిప్టులలో పనిచేయడానికి ఒప్పుకున్నందున చేయవలసిందేనని, చాలామంది అమ్మాయిలు ఇలాగే రాత్రిపూట పని చేస్తున్నారని వాదించారని, ఇప్పుడు ఈ ఘటన జరగటంతో నా మైండ్ పూర్తిగా బ్లాంక్ అయిపోయిందని చెప్పారు. అలాగే రాత్రి పూట పని చేయవలసిన ప్రాజెక్టులో తాను భాగం కాలేనని  చెబితే మా ఘనత వహించిన హెచ్ ఆర్ టీమ్ నాకు వార్నింగ్ లెటర్ పంపారని మరొక ఉద్యోగిని చెప్పారు. 
 
రాత్రిపూట ఖాళీగా ఉన్న ఆఫీసుల్లో పని చేయడం పూర్తి అసౌకర్యంగా ఉన్నందువల్లే చాలామంది మహిళలు నైట్ షిఫ్టుల్లో పనిచేయమని చెబుతున్నారు. కాని హెచ్ ఆర్ విభాగాలు మాత్రం పని ఎగ్గొట్టడానికే ఇలా చెబుతున్నారని ముద్రలేస్తున్నాయని మరొక మహిళా టెకీ చెప్పారు. కొంతమంది మహిళలు తమకు ల్యాప్‌టాప్‌లు ఇస్తే  ఇంటినుంచే చేసి లేట్ నైట్లో కూడా రిపోర్ట్ పంపుతామని చెప్పినా యాజమాన్యాలు పట్టించుకోలేదట. దేశంలో లేదా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని సహచర సిబ్బందితో ముడిపడి ఉన్న ప్రాజెక్టుల్లో పనిచేస్తుంటామని, అలాంటప్పుడు ఇంట్లోంచి పని చేస్తే పని ఎలా ఎగ్గొట్టగలమని కొంతమంది ఉద్యోగినులు చెప్పారు. 
 
తాము ఎల్లప్పుడు ఆన్ లైన్ లోనే ఉంటామని, తమ పనిని నిత్యం పరిశీలిస్తూనే ఉంటారని, రోజు ముగిసేసరికి మేం పూర్తి చేసిన పనుల వివరాలను మేనేజర్లకు తప్పక రిపోర్టు చేయాల్సి ఉంటుందని అలాంటప్పుడు మహిళలు ఇంట్లోంచి పని పూర్తి చేసి పంపడం ఐటీ దిగ్గజ కంపెనీలకు ఎందుకు రుచించదలేదని మరో ఉద్యోగిని ప్రశ్నిచారు. 
 
మహిళా టెకీ రసిలా రాజు హత్య తర్వాత ఇన్ఫోసిస్ కు చెందిన పలువురు మహిళలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కొంతమంది తాము ఇక రాత్రి షిఫ్టుల్లో పని చేసేది లేదని  తే్ల్చి చెప్పేశారు. రసిలా హత్యా ఘటనను నేను స్క్రీన్ షాట్ తీసి ఇన్ఫోసిస్‌లో నేను పనిచేసే చివరిరోజు వరకు భద్రపర్చుకుంటాను. మామేనేజర్ వారాంతపు సెలవుదినాల్లో, సెలవుల్లో రాత్రిపూట ఆఫీసుకు రావాలని అడిగితే తిరుగులేని సమాధానం ఇస్తానని మరొక ఉద్యోగిని చెప్పారు. 
 
చివరకు ఉద్యోగులు సైతం ఉద్యోగినుల సమస్యల పట్ల సానుభూతిగా అర్థం చేసుకుంటూ సమర్థిస్తున్నారు. ప్రాజెక్టులను సకాలంలో పనిచేయడంపై దృష్టి పెట్టడం కంటే కంపెనీలు తమ సిబ్బంది భద్రతపై దృష్టి సారించాల్సి ఉంటుందని ఉద్యోగులు చెబుతున్నారు. వారాతంలో, రాత్రి పూట షిఫ్టుల్లో పని చేయాల్సిన మహిళలకు ల్యాప్ టాప్ ఇచ్చి ఇంటివద్ద నుంచి పనిచేయించడం అర్థవంతమైన ఆలోచనే. అమ్మాయిలు ఆకతాయిల దాడికి సులువగా ఎర అవుతుంటారు కాని ఇలాంటి ఉన్మాదుల చేష్ట్యలకు అబ్బాయిలు కూడా బలవుతారు. అబ్బాయిలను సైతం నిలువుదోపిడీ చేస్తారు. చావగొడతారు, కొన్నిసార్లయితే చంపేస్తున్నారు కూడా అని ఉద్యోగులు వివరించారు. 
 
తమ సిబ్బంది భద్రత, సంక్షేమం పట్ల తన వైఖరిని ఇకనైనా మార్చుకోవలసిన అవసరం ఇన్ఫోసిస్‌కి ఎంతైనా ఉందని చాలామంది ఉద్యోగులు ఫీలవుతున్నారు. రసిలా హత్య ఘటనతో ఉద్యోగినుల మూడ్ అస్థిరంగా తయారైంది. చివరకు మేనేజర్లతో కూడా వారి కఠిన వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
మహిళా టెకీ హత్య జరిగిన తర్వాత మేలుకున్న ఇన్పోసిస్ మహిళలు రాత్రి పూట పనిచేయడాన్ని తొలగించే వైపు కృషి చేస్తామని ప్రకటన జారీ చేసింది. మహిళలు రాత్రిపూట 8 గంటలకే పని ముగించి వెళ్లమని కోరుతున్నమని  తెలిపింది. ఒకవేళ మహిళలు రాత్రి పూట ప్రయాణం చేయవలసి వస్తే వారికి ప్రయాణ ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నామని ఈ ప్రకటన పేర్కొంది. 
 
కాని అమెరికన్లకోసం, విదేశీయుల కోసం రాత్రిళ్లు మేలుకుని పనిచేయవలసిన జీవన పరిస్థితులు వచ్చాక వీటిని దాటుకుని సురక్షితమైన పని పరిస్థితులను మహిళలు ఎలా కల్పించుకోవాలి అనేది చిక్కు సమస్యే.