శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2014 (11:54 IST)

'సెల్పీ' లైక్స్ మోజులో... ప్రాణాలు కోల్పోయిన ఛత్తీస్‌గఢ్ విద్యార్థి!

స్మార్ట్ ఫోన్ల రాకతో యువత సెల్ఫీ మోజులో మునిగిపోయింది. ఇవి కొన్ని సందర్భాల్లో ప్రాణాల మీదకు తెస్తున్నా యువత మాత్రం ఈ సెల్ఫీలపై ఉన్న మోజు మాత్రం ఏమాత్రం తగ్గించుకోవడం లేదు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ యువకుడు ఇదేవిధంగా సెల్ఫీ కోసం ఓ ఫోటో తీయించుకునేందుకు గూడ్స్ బోగీ ఎక్కి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే.. 
 
ఛత్తీస్‌గఢ్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో కేతన్ అనే విద్యార్థి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. బిలాస్‌పూర్ జిల్లా వైశాలి నగర్ వాసి. కేతన్ తండ్రి సంజయ్ పోద్దార్ రైల్వేలో ఇంజన్ డ్రైవర్. ఆదివారం సాయంత్రం మిత్రులతో కలిసి కేతన్ ఉస్లాపూర్ లోకోమోటివ్ సబ్ స్టేషన్ వద్దకు వెళ్లాడు. అక్కడ గతంలో ఓ గూడ్సు రైలుపై నిలబడి తీసుకున్న ప్రొఫైల్ పిక్చర్‌కు ఫేస్ బుక్‌లో ఎన్నో లైక్స్, కామెంట్స్ వచ్చాయి. అందుకే మరోసారి అక్కడే, అదే రైలుపై నిలబడి ఫొటో తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో గూడ్సు రైలు ఎక్కాడు. 
 
కొన్ని స్నాప్స్ క్లిక్ చేసిన తర్వాత, చేతులు పైకెత్తి పోజ్ ఇవ్వబోయాడు. పైన ఉన్న విద్యుత్ వైర్లు అతని చేతులకు తగలడంతో విద్యుదాఘాతానికి లోనయ్యాడు. దీంతో, అతని మిత్రులు భయంతో పరుగులు తీశారు. విషయం ఎవరికీ చెప్పకుండా, ఎవరింటికి వారు వెళ్లిపోయారు. కేతన్ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు వెదుకులాట ప్రారంభించారు. అతని స్నేహితులను గట్టిగా అడిగితే, అప్పుడు చెప్పారు... కేతన్ చనిపోయాడని. పోలీసులు ఆ విద్యార్థి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, దర్యాప్తు ఆరంభించారు.