శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 18 జులై 2014 (12:28 IST)

ఘోరం: శిక్షణలో ఉన్న క్రైస్తవ సన్యాసినిపై అత్యాచారం!

కామాంధులు దేశంలో రెచ్చిపోతున్నారు. దేశంలో అత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా శిక్షణలో ఉన్న ఓ క్రైస్తవ సన్యాసినిపై అత్యాచారం జరిగిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బుధవారం జరిగిన ఈ ఘటనపై బాధితురాలు గురువారం ఫిర్యాదు చేసినట్లు బెంగళూరు జాయింట్ పోలీస్ కమిషనర్ శరత్ చంద్ర చెప్పారు. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హెన్నూర్ పరిసరాల్లో ఉన్న సిస్టర్స్ ఆఫ్ హోలీ నేటివిటీలో ఓ 17 ఏళ్ల బాలిక సన్యాసినిగా శిక్షణ పొందుతోంది. భవనంలోని కింది అంతస్తులో ఉన్న తన గదిలో బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు తలుపు తట్టారు.
 
తలుపు తీయడంతోనే విద్యార్థినిని తోసేసి లోపలికి ప్రవేశించిన దుండగులు ఆమెపై అత్యాచారం జరిపారు. దీంతో విద్యార్థిని స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత దుండగులు పారిపోయారు. దీనిపై ఆశ్రమ నిర్వాహకురాలికి విషయాన్ని నివేదించిన బాధితురాలు అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.