ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు : కేజ్రీవాల్పై పోటీలో నెల్లూరు వాసి
ఢిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై ఓ తెలుగు వ్యక్తి పోటీకి నిలిచారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలానికి చెందిన కందుకూరు సునీల్ కుమార్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గురువారం సాయంత్రం నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ... నియోజకవర్గంలో ప్రజల సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం కూడా వాటిని గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజధానికి ఉండాల్సిన అర్హతను కూడా కోల్పోయే స్థితికి చేరిందని అన్నారు. తనకు ఓటేసి గెలిపిస్తే అభివృద్ధి దిశగా నడిపిస్తానని అన్నారు. అధికారులు తన నామినేషన్ను ఆమోదించినట్లు సునీల్ వెల్లడించారు.