గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 31 జులై 2017 (03:45 IST)

జీన్స్‌ వేసుకునే పిల్ల సర్పంచా అని వెక్కిరిస్తే గ్రామాన్నే మార్చి పడేసింది.

తలమీదుగా పైట కప్పుకోవటం అనే పురాతన ఆచారాన్ని గౌరవించని, జీన్స్‌ ప్యాంట్, కుర్తా, మెడచుట్టూ స్కార్ఫ్‌తో కనపడే అమ్మాయి సర్పంచ్‌గా పోటీచేస్తే ఇలాంటి పిల్లను గెలిపించి గద్దెమీద కూర్చోబెడితే ఊరి ఆడపిల్లలు పాడైపోరా.. పైగా ఏ రాజకీయ పార్టీకి చెందని మనిషికి అ

ఇది స్వచ్ఛభారత్ అనే పదమే మన దేశంలో ఇంకా వినిపించని రోజులు. జాతీయ మీడియాలో, ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమలో అత్యున్నత ఉద్యోగాలు చేసిన ఒక ఎంబీఏ స్టూడెంట్ తనముందున్న విస్తృత అవకాశాలను వదులుకుని సొంత ఊరికి పయనమైంది. ఊరి సర్పంచ్ పదవికి పోటీ చేసింది జీన్స్ ప్యాంట్ వేసుకుని బలాదూర్‌గా తిరిగే అమ్మాయి ఊరిసర్పంచా అంటూ అగ్రవర్ణాలు గేలి చేశాయి. తలమీదుగా పైట కప్పుకోవటం అనే పురాతన ఆచారాన్ని గౌరవించని, జీన్స్‌ ప్యాంట్, కుర్తా, మెడచుట్టూ స్కార్ఫ్‌తో కనపడే అమ్మాయి సర్పంచ్‌గా పోటీచేస్తే ఇలాంటి పిల్లను గెలిపించి గద్దెమీద కూర్చోబెడితే ఊరి ఆడపిల్లలు పాడైపోరా.. పైగా ఏ రాజకీయ పార్టీకి చెందని మనిషికి అధికారం ఎలా ఇస్తాం అంటూ అగ్రవర్ణాలు ఈసడిస్తే బడుగు బలహీన జనం భారీ మెజారీటీతో ఆమెను గెలిపించారు. సర్పంచ్‌గా పంచాయితీ ఆఫీసులో కూర్చోబెడితే వాళ్లకు చేసిన వాగ్దానాలను నెరవేరుస్తానని ఎన్నికల సమయంలో చేసిన దీక్షనే ప్రమాణంగా స్వీకరించిందామె. అప్పటినుంచి ఆమెది చరిత్ర. ఆ ఊరిది చరిత్ర. గ్రామ సంప్రదాయాల పేరిట సాగుతున్న మూఢత్వాన్ని పెకిలించిన వేసిన చరిత్ర. 900 ఇళ్లలో 900 టాయ్‌లెట్లు నిర్మించుకున్న చరిత్ర. స్వచ్చభారత్‌కు ఎన్నో ఏళ్ల క్రితం ఒక జీన్స్ ప్యాంట్ అమ్మాయి వన్ పీస్‌గా మారి మార్చిన చరిత్ర అది.
 
ఇది రాజస్తాన్‌లోని టోంక్ జిల్లాకు చెందిన సోడా గ్రామ చరిత్ర. ఈ గ్రామంలోనే ఒక రాజ్‌పుత్ గ్రామంలో జన్మించిన చావి రజావత్ అనే అమ్మాయి తండ్రి మిలటరీ ఆఫీసర్ కావడం దేశమంతా తిరుగుతూ మన మదనపల్లికి వచ్చి రిషీవ్యాలీ స్కూల్లో చదువుకుంది. తర్వాత, ఢిల్లీలో, పుణేలో డిగ్రీ, ఎంబీఏలను పూర్తి చేసి టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎయిర్‌టెల్ వంటి సంస్థల్లో పనిచేసింది. కర్ల్‌సన్‌ గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌లో జాయిన్‌ అయింది. ఉత్సాహంతో పని చేస్తోంది. కానీ జీతం కోసం కాదు.. పదిమంది మంచి కోరే పని కావాలి.. అని తపన చెందింది. రిషీవ్యాలీలో నేర్పించింది ఏంటీ నీ కోసం కాదు.. నీ సమాజం గురించి ఆలోచించాలి.. అని బడి రోజులను గుర్తుచేసుకుంది.. అందరిలా కాదు.. ఎందరికో  స్ఫూర్తి పంచేలా బతకాలి.. అని నిర్ణయించుకుంది. అలా మహానగరాలకు పాకిన ఆమె జీవితం సొంత ఊరికి పయనించి సర్పంచ్ అయింది. 
 
ఊహ తెలిసినప్పటి నుంచి ఆ ఊరు అలాగే ఉంది. తాత 20 ఏళ్లు సర్పంచ్‌ పదవిలో ఉన్నా ఊళ్లో ఏ మాత్రం మార్పులేదు. టాయ్‌లెట్‌కి వెళ్లాల్సి వస్తే సూర్యోదయానికి ముందన్నా, సూర్యాస్తమయం తర్వాతైనా వెళ్లాలి. ఈ మధ్యలో అర్జెంట్‌ అయితే సూర్యుడి నిష్క్రమణ దాకా ఆగాలి. డయేరియా, విరేచనాల వంటివి వస్తే ఆ పరిస్థితి ఊహించుకోవడానికే భయం. ఏ ఇంటికీ టాయ్‌లెట్‌ లేదు. ప్రతి ఇంట్లోని ఆడ, మగ, పిల్లాజెల్లా, ముసలి, ముతక అందరూ చెరువు కట్టకు వెళ్లాల్సిందే. ఊరంతటికీ ఒకే ఒక్క మంచి నీటి వనరుగా ఉన్న ఆ చెరువును, దాని పరిసరాలను మలినం చేయాల్సిందే. సురక్షితమైన నీటి పథకం లేదు. కరెంట్‌ ఊళ్లో ఎన్ని గంటలు కరెంట్‌ ఉంటోంది అంటే మహా అంటే నాలుగు గంటలు.
 
స్వచ్ఛ్‌ భారత్‌ అభియాన్‌ రాకముందే.. దానికి మూడునాలుగేళ్ల ముందే స్వచ్ఛ్‌ సోడా కార్యక్రమాన్ని మొదలుపెట్టింది చావి. దీనికి ఊరు ఊరంతా ఆమెకు వ్యతిరేకమైంది. అవాక్కయినా అధైర్యపడలేదు చావి. బయట మలవిసర్జన చేస్తే గాలి, నీళ్లు, పరిసరాలు ఎలా మలినం అవుతాయో చెప్పింది. ఆరోగ్యకర్తలతో చెప్పించింది. అర్థం చేసుకున్న ఆడవాళ్లు చావి పక్షాన చేరారు. అందుకు రెండేళ్లు పట్టింది. 900 ఇళ్లున్న ఆ ఊళ్లో 800 ఇళ్లు టాయ్‌లెట్లు కట్టుకున్నాయి. మిగిలిన వంద ఇళ్లల్లోని వాళ్లు తరతరాలుగా వస్తున్న అలవాటును మానుకోవడానికి ఇష్టపడలేదు. మాన్పించడానికి పిల్లలను ఉసిగొల్పింది చావి. పిల్లల దండును తయారు చేసి చెరువు కట్టమీద బహిర్భూమికి కూర్చుంటున్న వారిమీదికి తోలింది.  చెరువుకట్టమీద కూర్చోబోయినప్పుడల్లా పిల్లలు గోల చేయడంతో పెద్దలకు సిగ్గేసి మానుకున్నారు. ఇప్పుడు సోడాలోని 900 ఇళ్లల్లో టాయ్‌లెట్లున్నాయి. బక్కరు కూడా బహిర్భూమిలో కాలకృత్యాలు తీర్చుకోరు. 
 
చావి ఘనత అంతటితో ఆగలేదు. ఇప్పుడు సోడా గ్రామంలోని ప్రతి వ్యక్తీ బ్యాంకు ఖతాదారే. వందమీటర్ల దూరంలో సెల్ టవర్ పెట్టించిది చావీ. ఊళ్లోని వాళ్లంతా ట్వంటీ ఫోర్‌ బై సెవెన్‌ మొబైల్‌ఫోన్‌ను, ఉచిత డాటా సౌకర్యాన్నీ పొందుతున్నారు. మనిషి పోయిన బాధలో ఆ కుటుంబముంటే పరామర్శించడానికి వచ్చిన వాళ్లకు ఆ కుటుంబమే విందుతో మర్యాద చేయడమనే మహా ఆర్థిక భారాన్ని పట్టుబట్టి తొలగించింది. 
 
బహిర్భూమిగా మారి మలినమైన చెరువును కార్పొరేట్ సంస్థల సహాయంతో శుభ్రం చేయించింది.అంతకుముందే ఉన్న రిజర్వాయర్‌ను బాగు చేయించి వాన నీటిని నిలువచేసే సామర్థ్యాన్ని పెంచింది. ఇప్పుడు ఊళ్లో అందరికీ సురక్షితమైన మంచి నీరు అందుతోంది. అలాగే కరెంట్‌ కూడా. అంతకుముందు నాలుగు గంటలు ఉండే కరెంట్‌ ఇప్పుడు 22 గంటలు ఉంటోంది. ఊళ్లో ప్రతి వాడకు.. వాడల నుంచి కూడళ్లకు, కూడళ్ల నుంచి హైవేకు కలుపుతూ నలభై రోడ్లను నిర్మించింది. సోడా స్వరూపమే మారిపోయింది. మన దేశంలోని 75 శాతం జనాభా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోనే బతుకున్నారు. పాలసీ మేకర్స్‌ ఆ విషయాన్ని మరిచిపోయి.. దేశ ప్రగతికి సంబంధించి పాలసీల్లో గ్రామాలను ఇన్‌క్లూడ్‌ చేయట్లేదు. గ్రామీణుల జీవన ప్రమాణాలు పెరగకుండా దేశ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది కాబట్టి పాలసీ మేకర్స్‌ గ్రామాలు, వాటి స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని పాలసీలను చేయాలి. 
 
పెద్ద చదువులు చదువుకుంటున్నామంటే మన మూలాలను మరిచిపొమ్మని కాదు అర్థం. ఆ చదువులను మన రూట్స్‌ బలపడేలా ఉపయోగించమని. థ్యాంక్స్‌ టు రిషీ వ్యాలీ స్కూల్‌. అక్కడ అలవర్చుకున్న విలువలు నా గ్రామ సంక్షేమానికి ఎంతో తోడ్పడుతున్నాయి. అంటోది చావి. 

ప్రశ్నల్లా ఏమిటంటే చావి అనే వ్యక్తిమాత్రురాలు చేసిన పని మనదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోతున్నాయన్నదే.