శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జులై 2020 (21:07 IST)

సేల్స్ ఉమెన్‌కు సర్‌ప్రైజ్ గిఫ్టు ఇచ్చిన యజమాని?

బస్సు ఆపి ఓ అంధుడిని బస్సు ఎక్కించేందుకు పరుగులు తీసి తమ కంపెనీ ఉద్యోగిని ఆ కంపెనీ యజమాని సర్‌ప్రైజ్ గిఫ్టు ఇచ్చారు. తన ఇంటికి పిలిచిమరీ.. అరుదైన బహుమతి ఇచ్చారు. అంధుడి కోసం రోడ్డుపై పరుగులు తీసిన ఆమె మానవతకు అందరూ ముగ్ధులయ్యారు. ఈ ఘటన త్రిశూర్‌లో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఆ మహిళ పేరు సుప్రియ. జోయ్ అలుక్కాస్ నగల దుకాణంలో సేల్స్ ఉమన్‌గా పనిచేస్తోంది. తమ ఉద్యోగిని బస్సును ఆపేందుకు పరుగులు తీసి, ఓ దివ్యాంగుడికి సాయం చేసిన వైనం వీడియో ద్వారా చూసిన నగల దుకాణం ఛైర్మన్ జోయ్ అలుక్కాస్ ఎంతో ఆనందించారు. 
 
సుప్రియను అభినందించేందుకు వెళ్లిన జోయ్ అలుక్కాస్ ఆమె ఎంతో చిన్నదైన అద్దె ఇంట్లో జీవిస్తుండడం చూసి బాధ పడ్డారు. దాంతో, ఆమెకు ఓ కొత్త ఇల్లు కొనిచ్చేందుకు ఆ క్షణమే నిర్ణయించుకున్నారు. అయితే ఆ విషయం చెప్పకుండా, త్రిసూర్ లోని తమ ప్రధాన కార్యాలయానికి రావాలని సూచించారు. 
 
భర్తతో కలిసి జోయ్ అలుక్కాస్ కార్యాలయానికి వెళ్లిన సుప్రియకు చైర్మన్ నిజంగానే సర్ ప్రైజ్ ఇచ్చారు. కొత్త ఇంటి తాలూకు పత్రాలను ఆమెకు అందిస్తుండగా, వందల సంఖ్యలో ఉద్యోగులు కరతాళ ధ్వనులతో అభినందిస్తుండగా, సుప్రియ విస్మయానికి గురైంది. 
 
తాను ఆనాడు అంధుడి విషయంలో కావాలని చేసిందేమీ లేదని, తన మనసుకు తోచిన విధంగా చేశానని, ఆ సాయం ఇంత గుర్తింపు తెస్తుందని అనుకోలేదని సుప్రియ పేర్కొంది.