గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 డిశెంబరు 2020 (14:32 IST)

స్పీడు పోస్టు ద్వారా అయ్యప్ప ప్రసాదం.. భక్తులకు మరో గుడ్ న్యూస్

శబరిమల దేవాలయం నుంచి స్వామివారి ప్రసాదాన్ని స్పీడు పోస్టు ద్వారా భక్తులకు చేరవేయాలని భారత తపాలా శాఖ నిర్ణయించింది. తపాలా శాఖ తనకున్న విస్తారమైన నెట్‌ వర్కును ఉపయోగించి దేశం నలుమూలల ఉన్న భక్తులకు ప్రసాదాన్ని ఇంటివద్ద కే డెలివరీ చేయాలని నిర్ణయించింది.

దీనికోసం కేరళ పోస్టల్‌ సర్కిల్‌ ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. శబరిమల ప్రసాదం ప్యాకెట్‌ ను 450 రూపాయలు చెల్లించి భక్తులు ఏ పోస్టాఫీసు నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు.
 
మరోవైపు కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పింది. శబరిమలకు అనుమతించే భక్తుల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాల్లో అయ్యప్పను దర్శించుకునేందుకు మూడువేల మంది భక్తులకు అనుమతి ఇచ్చింది. మిగతారోజుల్లో ప్రతిరోజు రెండు వేల మంది భక్తులకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కేరళ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ ఓ ప్రకటనలో తెలిపారు. 
 
ఇప్పటివరకు సాధారణ రోజుల్లో రోజకు వెయ్యి మంది, శని, ఆది వారాల్లో రోజుకు 2వేల మంది భక్తులను దర్శనం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయ్యప్ప దర్శనం కోసం ఆన్‌లైన్‌లోనే టికెట్ బుకింగ్ సదుపాయం కల్పించారు. అయితే కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.