గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 21 ఆగస్టు 2014 (21:40 IST)

డగడగ డొక్కు ఆటో... 3 కిలోల బంగారు బిస్కెట్లు తళతళ

బెంగుళూరు రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అటుగా డగడగమంటూ కర్ణకఠోర శబ్దం చేసుకుంటూ వెళుతున్న ఓ డొక్కు ఆటోని ఆపారు. ఆ డొక్కు ఆటోని ఆసాంతం తనిఖీ చేసిన పోలీసులకు కళ్లు మిరుమిట్లు గొలిపే ఆశ్చర్యం కనబడటంతో నోళ్ళు వెళ్లబెట్టారు. దీనికి కారణం ఏంటయా అంటే, ఆ డొక్కు ఆటోలో ఏకంగా మూడు కిలోల బంగారు బిస్కెట్లు గలగలలాడుతూ కనిపించాయి మరి. బెంగళూరు నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు బిస్కట్ల రూపంలో ఉన్న ఈ బంగారాన్ని చేరవేస్తున్నట్లు తేలింది.
 
ఆటోలో తీసుకువెళుతున్న మూడు కిలోల బంగారు బిస్కట్లతోపాటు 42 లక్షల రూపాయలను కూడా బెంగళూరు గ్రేహౌండ్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న కోయంబత్తూరుకు చెందిన నటరాజ్, బాల, రాంకుమార్ల వద్ద ఉన్న సూట్‌కేసుల్లో ఇవి లభ్యమైనట్లు పోలీసులు కనుగొన్నారు. ఐతే ఈ బంగారు బిస్కట్లు, డబ్బుకు సంబంధించి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.