శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 14 డిశెంబరు 2019 (13:23 IST)

టిక్‌టాక్ మాయ.. భర్తను వదిలి ఇద్దరు పిల్లలతో వెళ్లిన భార్య

సోషల్ మీడియా మోజులో పడి అనేక మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ టిక్ టాక్ మోజులో పడి కట్టుకున్న భర్తను వదిలివేసి ఇద్దరు పిల్లలను తీసుకుని బెంగుళూరులో ఉన్న తన మగ వేషంలో ఉన్న మహిళ కోసం వెళ్ళిపోయింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణానికి చెందిన అర్చన.. గత కొంతకాలంగా వీడియోలో చేస్తూ వాటిని టిక్‌టాక్‌‌లో పోస్ట్ చేస్తూ వస్తోంది. ఈమె వీడియోలకు మంచి స్పందన ఉంది. ఈ క్రమంలో అర్చనకు టిక్‌టాక్‌లో బెంగళూరుకు చెందిన అంజలి అనే మరో మహిళతో పరిచయం ఏర్పడింది. 
 
బెంగళూరుకు చెందిన అంజలి పురుషుడి వేషంలో టిక్‌టాక్‌లు చేస్తుండేది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్యా ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే, అర్చనకు అప్పటికే వివాహం జరిగి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 
 
అంజలితో ప్రేమలో పడిన అర్చన మూడు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇద్దరు పిల్లలతో బెంగళూరుకు చెందిన అంజలితో కలిసి వెళ్లిపోయింది. జరిగిన ఘటనపై అర్చన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి అర్చనను అదుపులోకి తీసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 
 
కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు టిక్‌టాక్‌ మానియాలో యువత ఊగిపోతోంది. టిక్‌టాక్‌ వీడియోలతో సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయ్యేందుకు నానా పాట్లు పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా పెద్దలు సైతం టిక్‌టాక్‌లు చేస్తూ ఊహా లోకాల్లో తేలిపోతున్నారు. 
 
దీనివల్ల వస్తోన్న పాపులార్టీ కంటే చాలా చోట్ల ఎక్కువ అనర్థాలే చోటుచేసుకుంటున్నాయి. అనేక సందర్భాల్లో ప్రాణాలు పోయేంతటి ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. అనేక కుటుంబాల్లో లేనిపోని సమస్యలు తలెత్తుతున్నాయని పలువురు టెక్ నిపుణులు వాపోతున్నారు.