బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 21 ఆగస్టు 2017 (10:40 IST)

అన్నాడీఎంకే నుంచి శశికళ ఔట్.. తంబిదురై కూడా... ఎడప్పాడి నిర్ణయం?

అన్నాడీఎంకే నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళతో పాటు... లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురైలను పార్టీ నుంచి బహిష్కరించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నట్ట

అన్నాడీఎంకే నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళతో పాటు... లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురైలను పార్టీ నుంచి బహిష్కరించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనికి కారణం లేకపోలేదు. అన్నాడీఎంకే తిరుగుబాటు నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం వర్గాన్ని తమలో కలుపుకునేందుకు వీలుగా శశికళను పార్టీ నుంచి బహిష్కరించాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 
 
మరోవైపు అన్నాడీఎంకేలో మాజీ సీఎం ఓపీఎస్ చేరడం ఖాయమైపోయింది. ఈ విషయంలో అధికారిక ప్రకటన చేసేందుకు తగిన ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. సోమవారం విలీనంపై అధికారిక ప్రకటన వెలువడవచ్చునన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌ రావు సోమవారం హుటాహుటిన చెన్నైకి బయలుదేరడం గమనార్హం. 
 
ముంబైలో ఉన్న ఆయన సోమవారం నాటి తన అపాయింట్‌మెంట్లనీ రద్దు చేసుకొని.. చెన్నై బయలుదేరారని గవర్నర్ పీఆర్‌వో తెలిపారు. అన్నాడీఎంకేలోని ఈపీఎస్-ఓపీఎస్ శిబిరాల విలీనం నేపథ్యంలోనే ఆయన తమిళనాడు వస్తున్నట్టు తెలుస్తోంది.
 
మరోవైపు విలీన ప్రక్రియ జోరందుకున్న నేపథ్యంలో అన్నాడీఎంకే నేతల అత్యవసర భేటీకి పళనిస్వామి పిలుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశం వేదికగా చిన్నమ్మ శశికళను పార్టీ నుంచి సాగనంపబోతున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. శశికళతో పాటు.. ఆమె కుడిభుజంగా ఉన్న లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురైపై కూడా చర్య తీసుకోనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. దీంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.