శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 28 మార్చి 2015 (13:30 IST)

భూసేకరణ బిల్లు కోసం రాజ్యసభ ప్రోరోగ్.. మరోమారు ఆర్డినెన్స్ జారీ!

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భూసేకరణ బిల్లును రాజ్యసభలో ఆమోదింపజేసుకునేందుకు రాజ్యసభను ప్రోరోగ్ చేయాలని కేబినెట్ కమిటీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ సిఫారసు చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన సీసీపీఏ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయుడు, ముక్తార్ అబ్బాస్ నఖ్వీలు పాల్గొన్నారు.
 
నిజానికి భూసేకరణ బిల్లుపై జారీ చేసిన ఆర్డినెన్స్ గడువు ఏప్రిల్ 5వ తేదీతో ముగియనుంది. దీంతో మరోసారి ఆర్డినెన్స్ జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం రాజ్యసభను ప్రోరోగ్ చేయాలని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 
 
భూసేకరణ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు రాజ్యసభలో తగిన సంఖ్యాబలం లేకపోవటంతో బిల్లు వీగిపోకుండా ఆర్డినెన్స్ జారీ చేయటం తప్ప ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 
 
రెండో దశ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 20 నుంచి మే 8 వరకు జరుగనున్న నేపథ్యంలో, ఏదో ఒక సభను ప్రోరోగ్ చేస్తే తప్ప ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం కేంద్రానికి లేని నేపథ్యంలో రాజ్యసభను ప్రోరోగ్ చేసినట్టు తెలిపారు.