సీఎం పదవి దక్కకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానా? అవన్నీ ఉత్తుత్తివే: చిన్నమ్మ
తమిళ రాజకీయాలు క్షణక్షణం మారుతున్నాయి. అధికార అన్నాడీఎంకే పార్టీలో చీలికలు ఏర్పడ్డాయి. రోజురోజుకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బలం పుంజుకుంటుండటంతో శశికళ వర్గంలో కలవరం మొదలైంది. కానీ శశికళ వర్
తమిళ రాజకీయాలు క్షణక్షణం మారుతున్నాయి. అధికార అన్నాడీఎంకే పార్టీలో చీలికలు ఏర్పడ్డాయి. రోజురోజుకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బలం పుంజుకుంటుండటంతో శశికళ వర్గంలో కలవరం మొదలైంది. కానీ శశికళ వర్గంలోని ఎంపీ వైద్యలింగం మాట్లాడుతూ.. 'శశికళను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు త్వరలోనే ఆహ్వానిస్తారు. ఆమెకు పూర్తి మెజార్టీ ఉంది. తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తాం' అని అన్నారు.
అనంతరం శశికళ వర్గానికి చెందిన ఎమ్మెల్యే తంగ తమిళ్సెల్వన్ మాట్లాడుతూ.. 'చిన్నమ్మ'కు 128 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తమ శిబిరం బలనిరూపణకు సిద్ధమని ప్రకటించారు. అయితే పన్నీరుకు బలం పెరగడంతో చిన్నమ్మ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని వార్తలు వచ్చాయి. తన వర్గంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పన్నీర్ సెల్వం గూటికి చేరుతుండడంతో శశికళ వర్గంలో ఆందోళన మరింత పెరుగుతోందని వచ్చిన వార్తలపై శశికళ స్పందించారు. తమిళనాట నెలకొన్న పరిస్థితిపై పరోక్షంగా కేంద్రంపై ఆరోపణల వర్షం కురిపించారు.
ఎంపీలందరూ సెల్వం దగ్గరికి వెళ్తున్నారంటే.. కుట్ర వెనుక ఎవరున్నారో అర్థమవుతోందన్నారు. అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభం కొత్తేమీ కాదని, పార్టీలో సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటామని శశికళ ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో అన్నాడీఎంకే సుస్థిరంగా ఉంటుందని చెప్పారు. సీఎం పదవి దక్కని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని గవర్నర్కు లేఖ రాశానంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజంలేదని శశికళ స్పష్టం చేశారు.
రాజకీయాల్లో మహిళ కొనసాగడం ఎంతో కష్టమని.. అమ్మ జయలలిత ఇలాంటి కష్టాలెన్నింటినో భరించారని శశికళ వెల్లడించారు. అంతేగాకుండా.. అన్నాడీఎంకే పార్టీ చాలా పెద్ద పార్టీ అని దాన్ని చీల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. అమ్మ తరహాలోనే తాము కూడా సవాళ్లను అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఐదేళ్లపాటు అన్నాడీఎంకే ప్రభుత్వం కొనసాగుతుందన్నారు.