బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 జులై 2014 (14:48 IST)

కంటైనర్ దూసుకొచ్చింది.. నిద్రలోనే 12 మంది భక్తుల దుర్మణం

బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్‌లో ఘోరమైన ప్రమాదం సంభవించింది. నిద్రలో ఉన్న శివభక్తులపైకి ఓ కంటైనర్ లారీ దూసుకెళ్లడంతో 12 మంది మరణించారు. కంటైనర్ లారీ అదుపు తప్పడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన శివభక్తులంతా రోడ్డు పక్కన నిద్రిస్తున్నారు. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మరణించగా, మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
బీహార్లోని ఔరంగబాద్ జిల్లాలోని న్యూఢిల్లీ - కోల్కత్తా 2వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఆ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ ఉపేంద్ర కుమార్ శర్మ వెల్లడించారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
 
మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారని చెప్పారు. శివభక్తులంతా జార్ఖాండ్లోని దేవ్గఢ్ దేవాలయాన్ని సందర్శించుకుని వస్తున్నారని... ఆ క్రమంలో శివభక్తులంతా ప్రయాణ బడలికతో వారు ప్రయాణిస్తున్న బస్సును జాతీయ రహదారి పక్కన ఉంచి ... ఆ పక్కనే వారు నిద్రకు ఉపక్రమించారని ఎస్పీ వెల్లడించారు. అదే రహదారిపై అతివేగంతో వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పడంతో శివభక్తులపైకి దూసుకెళ్లిందని చెప్పారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.