రెండేళ్ళ పాలనలో ఏం సాధించారని సంబరాలు : మల్లికార్జున ఖర్గే
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండేళ్ళ పాలన, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న సంబరాలపై లోక్సభలో కాంగ్రెస్ పార్టీ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఏమీ సాధించకుండానే సంబరాలు జరుపుకుంటోందన్నారు. ప్రజా సంక్షేమానికి వారేం చేశారో చెప్పాలని... ప్రజలకు అసలేం కావాలో తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.
ఆర్థిక రంగం బలోపేతం కావడానికి భాజపా ఏం చేసిందో ప్రజలందరికీ తెలుసునని.. వారిని మోసం చేయలేరన్నారు. కనీసం నిత్యావసరాల ధరలను నియంత్రించలేకపోయారన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా.. దేశీయంగా మాత్రం ఎక్సైజ్ డ్యూటీ పేరుతో పెట్రోల్ ధరలు పెంచుతూ ప్రజలపై భారం మోపడమే మోడీ సర్కారు సాధించిన విజయమా అని ప్రశ్నించారు.