శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 12 నవంబరు 2014 (13:03 IST)

అలీగఢ్ ముస్లీం వర్శిటీ వీసీ వ్యాఖ్యలపై నివేదిక కోరిన కేంద్రం!

విశ్వవిద్యాలయ గ్రాంథాలయంలోకి అమ్మాయిలకు, కుక్కలకు ప్రవేశం లేదంటూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం ఉపకులపతి లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జమీరుద్దీన్ షా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించి నివేదిక కోరింది. షా వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో.. ఇది మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం వీసీ జమీరుద్దీన్ షా నుంచి వివరణ కోరింది. 
 
అమ‘అమ్మాయిలొస్తే.. అబ్బాయిల సంఖ్య నాలుగు రెట్లు పెరుగుతుంది. అందువల్ల విశ్వవిద్యాలయ ప్రధాన గ్రంథాలయంలోకి విద్యార్థినులను అనుమతించడం కుదరదు’ అంటూ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ) వైస్ చాన్స్‌లర్ లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. 
 
దీనిపై కేంద్ర మానవవనరుల శాఖామంత్రి స్మృతీ ఇరానీ స్పందిస్తూ.. ‘మనకు స్వాతంత్య్రం లభించింది అంటే.. విద్య, రాజ్యాంగ హక్కులు అందరికీ సమానమేనని భావిస్తున్నాం. అయితే, మన మనోభావాలు దెబ్బతినే, మన కూతుళ్లు అవమానపడేలా కొన్ని ఘటనలు జరుగుతున్నాయి’ అని ఢిల్లీలో మౌలానా ఆజాద్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో అన్నారు. ఈ విషయంపై ఏఎంయూ వీసీ నుంచి నివేదిక కోరామని, ఈ నివేదిక తమకు అందిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
 
కాగా, విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జమీరుద్దీన్ షా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూనివర్సిటీకి చెందిన అండర్‌గ్రాడ్యుయేట్ అమ్మాయిలను ప్రధాన ‘మౌలానా ఆజాద్’ లైబ్రరీలోకి అనుమతించకపోవడంపై మాట్లాడుతూ.. ‘ఇది క్రమశిక్షణకు సంబంధించిన విషయం కాదు. మౌలానా ఆజాద్ లైబ్రరీలో తగినంత స్థలం లేదు. ఇప్పటికే అది నిండిపోయింది. అబ్బాయిలు కూర్చోడానికే స్థలం లభించడం లేదు’ అన్నారు. అయితే, తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మంగళవారం షా వివరణ ఇచ్చారు. 
 
పీజీ చదువుతున్న వారందరినీ వర్సిటీ లైబ్రరీలోకి అనుమతిస్తున్నామని, డిగ్రీ కోర్సుల్లో ఉన్న 2,500 మంది అమ్మాయిలను మాత్రం రానివ్వడం లేదని పేర్కొన్నారు. వారంతా ఉమెన్స్ కాలేజీలో చదువుతున్నారని, అక్కడి లైబ్రరీనే వారు వినియోగించుకోవచ్చునని చెప్పారు. ‘యూనివర్సిటీలో దాదాపు 4 వేల మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినులు ఉన్నారు. వారందరినీ అనుమతిస్తే లైబ్రరీలో స్థలం సరిపోదు. అందువల్లే వారిని అనుమతించడం లేదు. ఇవేమీ కొత్తగా విధించిన ఆంక్షలు కావు. 1960లో లైబ్రరీ ఏర్పాటైనప్పటి నుంచీ ఈ నిబంధన కొనసాగుతోంది. మహిళా సాధికారతకు మేం వ్యతిరేకం కాదు’ అని వివరించారు.