గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2016 (09:49 IST)

సీన్ రివర్స్ : కలవరపాటుకు గురైన శశికళ... పోయెస్‌ గార్డెన్‌కు సెక్యూరిటీ వాపస్‌...

దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రియనెచ్చెలి శశికళకు పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయా? చిన్నమ్మ.. చిన్నమ్మ అంటూ ఆమె చుట్టూ తిరిగిన నేతలు ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారా? పార్టీ పగ్గాలు ఆమెకు దక్కకుండా చ

దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రియనెచ్చెలి శశికళకు పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయా? చిన్నమ్మ.. చిన్నమ్మ అంటూ ఆమె చుట్టూ తిరిగిన నేతలు ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారా? పార్టీ పగ్గాలు ఆమెకు దక్కకుండా చేసేందుకు పావులు కదుపుతున్నారా? గత రెండురోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వంను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిలో కూర్చో బెట్టేందుకు ఓ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 
 
అదేసమయంలో విశ్వవిద్యాలయాల ఉప కులపతులు (వీసీ) పోయస్‌ గార్డెన్‌లో శశికళను కలవడంపై గవర్నర్‌ వివరణ అడగడం, పోయస్‌ గార్డెన్ చుట్టూ ఉన్న పోలీసు భద్రతను తొలగించడం ఇవన్నీ ఆమెలో తీవ్ర కలవరపాటును కలిగిస్తున్నాయి. ఈ ప్రతికూల పరిస్థితులు మూడు రోజుల తర్వాత జరుగబోయే పార్టీ సర్వసభ్య మండలి సమావేశంలో ప్రతిబింభించే అవకాశం ఉందని శశికళ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
 
ముఖ్యంగా.. జయలలిత మరణం తర్వాత శశికళనే తమిళనాడు ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారు. దీంతో ఆమెను 11 మంది వైస్‌ ఛాన్సలర్లు కలుసుకున్నారు. దీన్నిపై ఉన్నత విద్యాశాఖ వివరణ కోరుతూ రాష్ట్ర గవర్నర్‌ కార్యాలయం నోటీసు పంపింది. ప్రభుత్వపరంగా, రాజకీయపరంగా ఏ పదవిలోనూ లేని శశికళను వైస్‌ఛాన్సలర్లు పోయెస్‌ గార్డెనకు వెళ్ళి కలుసుకోవడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలు తలెత్తాయి. 
 
పైగా.. ఇలాంటి ఉపకులపతులను తక్షణం డిస్మిస్ చేయాలని విపక్ష నేతలంతా డిమాండ్ చేశారు. ఈ విషయంపై స్టాలిన గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తూ గవర్నర్‌కు ఓ లేఖను కూడా పంపారు. దీంతో శశికళను వైస్‌ఛాన్సలర్లు కలుసుకోవడంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకు రాజ్‌భవన అధికారులు నోటీసు జారీ చేసింది. 
 
మరోవైపు.. జయలలిత నివాసగృహం ‘పోయెస్‌ గార్డెన్’కు హై సెక్యూరిటీని సోమవారం ఉపసంహరించారు. జయలలిత మృతి తర్వాత కూడా పోలీసు ఉన్నతాధికారులతో సహా 240 మంది పోలీసులు ఆమె నివాసగృహం వద్ద కాపలా కాస్తూ వచ్చారు. ఈ విషయంపై ప్రతిపక్షనేత స్టాలిన ఓ ప్రకటన జారీ చేస్తూ... జయలలిత నివాసగృహంలో ప్రస్తుతం రాజకీయ నాయకులు గానీ, జెడ్‌కేటగిరీ భద్రత కలిగినవారు గానీ లేని పరిస్థితుల్లో అక్కడ ఇంకా హై సెక్యూరిటీ ఏర్పాట్లు కొనసాగించటం భావ్యమేనా అని ప్రశ్నించారు. 
 
స్టాలిన్ ప్రకటనకు పీఎంకే అధ్యక్షుడు రాందాస్‌ తదితరులు వత్తాసు పలికారు. స్టాలిన్ ప్రకటనతో పాలకవర్గాల్లో చలనం వచ్చింది. సోమవారం జయలలిత నివాసగృహం వేద నిలయానికి 25 యేళ్లపాటు కొనసాగిన హై సెక్యూరిటీ ఏర్పాట్లను ఉపసంహరించారు. ప్రస్తుతం నలుగురు హెడ్‌కానిస్టేబుళ్లు మాత్రమే ఆ భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. ఈ పరిణామాలతో శశికళ కలవరపాటుకు గురయ్యారు.