పుణే ఘటన : రాజ్ నాథ్ సింగ్ పరామర్శ.. సహాయక చర్యలు వేగిరం
మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు పుణే సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య గురువారం నాటికి 25కి చేరుకుంది. దాదాపు రెండు వందల మంది శిథిలాల మధ్య చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. 40కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
మహారాష్ట్రలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. బుధవారం పుణె సమీపంలోని అంబెగాన్లో కొండచరియలు విరిగిపడ్డాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
పుణే సమీపంలోని అంబేగాన్ తెహిసిల్లోని మాలిన్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందన్నారు. కొండ చరియలు విరగడంతో పెద్దపెద్ద రాళ్లు కిందకు పడ్డాయన్నారు. కాగా ఈ ప్రాంతాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సందర్శించారు.