బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2017 (13:57 IST)

జీఎస్టీ అంటో ఏంటో తెలియని యూపీ మంత్రి.. ప్రశ్నిస్తే నీళ్లు నమిలారు...

జీఎస్టీ... వస్తు సేవల పన్ను.. ఈ పేరు ఇపుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. జూలై ఒకటో తేదీ నుంచి ఈ పన్ను విధానం అమల్లోకి రానుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే చేకూరే లాభనష్టాలపైనే ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్

జీఎస్టీ... వస్తు సేవల పన్ను.. ఈ పేరు ఇపుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. జూలై ఒకటో తేదీ నుంచి ఈ పన్ను విధానం అమల్లోకి రానుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే చేకూరే లాభనష్టాలపైనే ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. కానీ, దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు మంత్రిగా బీజేపీ నేతకు మాత్రం జీఎస్టీ అంటో ఏమిటో తెలియదు. పైగా జీఎస్టీ పూర్తి పేరు చెప్పాలని కోరగా ఆయన సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ఆ మంత్రి పేరు రమాపతి శాస్త్రి. యూపీ సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ వ్యవహారాల మంత్రిగా పని చేస్తున్నారు. 
 
ఆయన గురువారం మహరాజ్‌గంజ్‌లో స్థానిక వ్యాపారులతో సమావేశమై జీఎస్టీ వల్ల ప్రయోజనాల గురించి చెబుతున్నారు. అయితే జీఎస్టీ అంటే ఏంటో నిర్వచనం చెప్పాలంటూ ఓ విలేకరి ప్రశ్నించాడు. ఒక్కసారిగా అలా అడిగేసరికి మంత్రి రమాపతి తెల్లమొహం వేశారు. అయితే పక్కనున్నవారు... ఆయన పరిస్థితిని అర్థం చేసుకుని జీఎస్టీ అబ్రివేషన్‌ చెప్పినప్పటికీ మంత్రి అర్థం చేసుకుని చెప్పలేక దొరికిపోయారు. అంతేకాకుండా జీఎస్టీ అంటే ఏంటో తనకు తెలుసునని, కానీ ఇప్పుడు గుర్తుకు రావడం లేదని బుకాయించడం విశేషం. 
 
కాగా యూపీ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్‌ రెండు రోజుల క్రితం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి జీఎస్టీ అమలుతో పాటు లాభ, నష్టాల గురించి చర్చించారు. అలాగే జీఎస్టీ అమలు వల్ల గందరగోళంతో పాటు, దానివల్ల ప్రయోజనాలపై  ప్రజలకు మరింత అవగాహన కలిగించేందుకు ప్రయత్నించాలని ఆయన తన మంత్రివర్గ సహచరులతో పాటు అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ అంటే... అంటూ మంత్రి అడ్డంగా దొరికిపోవడం గమనార్హం.