గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (14:26 IST)

బీటెక్ పట్టభద్రుడి సోషల్ ఫ్రాడ్ ... 'క్లిక్కులు.. లైక్‌'ల పేరుతో రూ.3700 కోట్లు దోచేశాడు.. ఎలా?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ బీటెక్ పట్టభద్రుడు సోషల్ ఫ్రాడ్‌కు పాల్పడ్డాడు. క్లిక్కు, లైక్‌ల పేరుతో ఏకంగా రూ.3700 కోట్లను దోచుకున్నాడు. ఈ బాధితుల్లో చాలా మంది డబ్బుకు ఆశపడిన నిరుద్యోగులూ ఉండటం గమనార్హం.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ బీటెక్ పట్టభద్రుడు సోషల్ ఫ్రాడ్‌కు పాల్పడ్డాడు. క్లిక్కు, లైక్‌ల పేరుతో ఏకంగా రూ.3700 కోట్లను దోచుకున్నాడు. ఈ బాధితుల్లో చాలా మంది డబ్బుకు ఆశపడిన నిరుద్యోగులూ ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఈ సోషల్ ఫ్రాడ్ బయటపడటంతో బీటెక్ పట్టభద్రుడితో పాటు.. మరో ఇద్దరిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. కంప్యూటర్‌లో క్లిక్కులు, లైక్‌ల పేరుతో చేసిన ఈ సోషల్ ఫ్రాడ్ వివరాలను పరిశీలిస్తే... 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనుభవ్ అనే యువకుడు 2010లో బీటెక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఓ కంపెనీ పెట్టాడు. దాంట్లో ఎక్కువ డబ్బు రాకపోవడంతో 2015లో ఈ మోసానికి శ్రీకారం చుట్టాడు. ఇందుకోసం నోయిడా సెక్టార్‌ 63లో అబ్లేజ్‌ ఇన్ఫో‌సొల్యూషన్స్ లిమిటెడ్‌ అనే సంస్థ 'సోషల్‌ట్రేడ్‌.బిజ్' అనే ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ వెబ్‌సైట్‌‌ను ప్రారంభించాడు. 
 
ఈ వెబ్‌సైట్ ద్వారా అమాయకులతోపాటు.. చదువుకున్నవారు, ఉద్యోగులకు డబ్బు పేరుతో ఎరవేశాడు. సోషల్‌ ట్రేడ్‌ వెబ్‌సైట్‌లో సభ్యులుగా చేరేందుకు రూ.5750, రూ.11,500, రూ.28,750, రూ.57,500 అనే నాలుగు ప్యాకేజీలను ప్రకటించారు. ఈ మొత్తంలో డబ్బు డిపాజిట్‌ చెల్లించి సభ్యులుగా చేరిన వారికి సోషల్‌ ట్రేడ్‌ సంస్థ ఏవో కొన్ని వెబ్‌సైట్ల లింకులు పంపుతుంది. వాటిపై చేసే ఒక్కో క్లిక్కుకూ రూ.5 ఇస్తామని ఆశ కల్పించాడు. ప్యాకేజీని బట్టి లింకుల సంఖ్యలో పెరుగుదల ఉంటుందని ఊరించాడు. దీంట్లో మరికొందర్ని చేర్పిస్తే రూ.లక్షలకు లక్షలు గడించవచ్చని ఆశపెట్టడంతో సుమారు ఏడు లక్షల మంది ఈ స్కీములో చేరారు.  
 
వీరందరినీ నమ్మించేందుకు ప్రారంభ దశల్లో చేరి రూ.57,500 చెల్లించిన వారికందరికీ తొలి యేడాదిలోపే కట్టిన సొమ్ము తిరిగి ఇచ్చేశాడు. అయితే.. ఆ డిపాజిట్‌ మొత్తం ఒక యేడాదికేననడంతో చాలా మంది రెండో ఏడాదికి కూడా అంతమొత్తం చెల్లించారు. ఇలా వారి చేత డబ్బు కట్టించుకుని.. ఆ డబ్బు మళ్లీ వారికే ఇచ్చి.. యేడాది తిరగగానే అదే డబ్బును మళ్లీ వారితో డిపాజిట్‌ రూపంలో కట్టించుకోవడం ద్వారా ఎబ్లేజ్‌ సొల్యూషన్స్‌ భారీ మోసానికి పాల్పడ్డాడు. 
 
మొదట్లో సక్రమంగా చెల్లింపులు జరపడంతో ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కానీ, ఇటీవలికాలంలో ఈ సైట్‌లో కొత్తగా చేరేవారి సంఖ్య తగ్గిపోవడంతో చెల్లింపుల జోరు తగ్గింది. దీంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల సంఖ్య రోజురోజుకీ పెరగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సంస్థ డైరెక్టర్‌‌గా ఉన్న అనుభవ్‌ మిట్టల్‌, సీఈవో శ్రీధర్‌, టెక్నికల్‌ విభాగాధిపతి మహేశ్‌ దయాల్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ సోషల్ ఫ్రాడ్ గుట్టురట్టయింది. 
 
ఈ స్కామ్‌పై నోయిడాలోని సూరజ్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అలాగే.. సంస్థ బ్యాంకు ఖాతాలను సీల్‌ చేశారు. సంస్థ వద్ద ఉన్న రూ.500 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై మరింత నిశితంగా దర్యాప్తు చేయాల్సిందిగా రిజర్వు బ్యాంకు, ఆదాయపన్ను శాఖ, సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ)కి పోలీసులు సమాచారం అందించారు.