ఓవర్ డ్యూటీతో అలసిన డ్రైవర్... 17 గంటల పాటు గూడ్సు రైలును నిలిపేశాడు...
భారతీయ రైల్వేలో డ్రైవర్లు, గార్డులుగా పని చేసే వారు ఓవర్ టైమ్ డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి వల్ల ఇదేవిధంగా కొనసాగితే అనేక ప్రమాదాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితికి ఉత్తరప్రదేశ్లో తాజాగా జరిగిన ఓ సంఘటనే మచ్చుతునక. వరుసగా ఓవర్టైమ్ డ్యూటీలు చేసి అలసిపోయిన ఓ గూడ్సు రైలు డ్రైవరు చివరకు ఒకరోజు తాను నడపాల్సిన గూడ్సు రైలును స్టేషన్లో 17 గంటలపాటు నిలిపేశాడు.
ఉత్తర్ప్రదేశ్లోని భదోహీ ప్రాంతానికి చెందిన ఓ రైలు డ్రైవర్ తాను నడుపుతున్న గూడ్స్ రైలుని స్థానిక మోధ్ రైల్వేస్టేషన్లో నిలిపివేశాడు. ఆ తర్వాత రైలు ఇంజిన్లోనే పనుకుని నిద్రపోయాడు. అలా ఏకంగా 17 గంటల పాటు నిలిపేశాడు.
కొన్ని గంటలపాటు పట్టాలపై రైలు నిలిచిపోవడంతో స్టేషన్ మాస్టర్ అప్రమత్తమై పరిశీలించగా ఇంజన్లో డ్రైవర్ నిద్రపోవడాన్ని గమనించాడు. ఎంత సర్ధి చెప్పినా అతను మాత్రం అదేవిధంగా నిద్రపోయాడు. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్నింటిని దారి మళ్లించాల్సి వచ్చింది.