శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 15 జనవరి 2019 (11:16 IST)

మోడీ - షాలకు ముచ్చెమటలు : యూపీలో 57 మంది సిట్టింగ్‌లకు నో ఛాన్స్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎస్పీ - బీఎస్పీ పార్టీల మధ్య కుదిరిన పొత్తు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలకు ముచ్చెమటలు పోయిస్తోంది. ముఖ్యంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 57 మంది సిట్టింగ్‌ల స్థానంలో కొత్తవారిని బరిలోకి దించాలని భావిస్తున్నారు. ఈ 57 స్థానాల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 
 
యూపీలో అధికార బీజేపీకి వ్యతిరేకంగా కొత్తగా ఎస్పీ, బీఎస్పీ కూటమి ఏర్పాటైంది. ఇందులో కాంగ్రెస్ పార్టీకి కూడా చోటులేదు. ఇది బీజేపీకి షాక్ కలిగించింది. ఈ నేపథ్యంలో పార్టీ అంతర్గత సర్వేలో 57 మంది సిట్టింగ్‌ ఎంపీలకు వ్యతిరేకంగా రిపోర్టులు వచ్చినట్టు సమాచారం. కేంద్రం అమలుచేస్తున్న పథకాలపై కిందిస్థాయిలో అవగాహన కల్గించాలన్న బీజేపీ చీఫ్‌‌‌‌ అమిత్‌‌‌‌ షా టార్గెట్‌‌‌ను చేరుకోవడంలో ఈ సిట్టింగ్‌ ఎంపీలు విఫలమైనట్టు చెబుతున్నారు. 
 
ఈ నెల 9వ తేదీన జరిగిన సమావేశంలో ఈ ఎంపీలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడంలేదని అమిత్‌‌‌‌షా స్వయంగా చెప్పారని మీడియా కథనాలు వచ్చాయి . ఎస్పీ- బీఎస్పీ కూటమిలో సామాజికంగా అన్ని వర్గాల వారికి టికెట్లు ఇచ్చే అవకాశముంటుందని భావించిన బీజేపీ.. ఆ దిశగా ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత నుంచి బయటపడేందుకు కొత్తవారిని బరిలోకి దింపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.