శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 మార్చి 2017 (18:11 IST)

మార్చి 27న అయోధ్యలో ఆదిత్యనాథ్ పర్యటన: ఏకాభిప్రాయం కోసం యోగి ఏం చేస్తారో?

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజల సమస్యల పరిష్కారంపై పూర్తిగా దృష్టి పెట్టారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీని చక్కదిద్దే క్రమంలో శరవేగంగా తన పని తాన

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజల సమస్యల పరిష్కారంపై పూర్తిగా దృష్టి పెట్టారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీని చక్కదిద్దే క్రమంలో శరవేగంగా తన పని తాను చేసుకుంటూ దూసుకెళ్తున్నారు. కీలక నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు. ఎవరేమనుకున్నా నాకేంటి.. అన్నట్లుగా ప్రజా సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నారు. 
 
తాజాగా అయోధ్య సమస్యకు పరిష్కారం కనుగొనే విషయంలో యోగి దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా త్వరలోనే రామ జన్మభూమి అయోధ్యలో యోగి ఆదిత్యనాథ్ పర్యటించనున్నట్లు సమాచారం. అయోధ్యలో రామ మందిర నిర్మాణం అంశంపై.. ఇతర వర్గాలతో పాటు ఏకాభిప్రాయం సాధించేందుకు.. సామరస్య పూర్వకంగా పరిష్కార మార్గాన్ని ఎంచుకునే దిశగా యోగి చర్యలు చేపడుతున్నారు. 
 
సుప్రీం కోర్టు సైతం కోర్టు బయటే చర్చల ద్వారా ఈ అంశాన్ని సామరస్యంగా పరిష్కరించాలని సూచించిన నేపథ్యంలో.. అయోధ్యలో యోగి పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఇందుకు సంబంధించిన చర్యలకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే శ్రీకారం చుట్టింది. మార్చి 27వ తేదీన యోగి పర్యటన ఉంటుందని సమాచారం. 
 
మరోవైపు యూపీలో గ్యాంగ్ రేప్‌కు గురైన మహిళ 8 సంవత్సరాల పాటు న్యాయం కోసం పోరాడుతోంది. సామూహిక అత్యాచారంతో పాటు.. ఆపై ఆమెతో బలవంతంగా యాసిడ్ తాగించిన దుండగులకు కఠిన శిక్ష పడాలని బాధిత మహిళ పోరాటం చేస్తోంది. ఇంకా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. 
 
లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ కాలేజి ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమెను, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరామర్శించారు. ఆమె వైద్య ఖర్చుల కోసం తక్షణ సాయంగా లక్ష రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. అంతేకాదు, ఆమెకు బలవంతంగా యాసిడ్ తాగించిన వాళ్లను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు.